గతేడాది కాలంలో టాలీవుడ్లో కొత్త థియేటర్లు కట్టేశారా? లేక మల్టీప్లెక్స్ల్లో స్క్రీన్స్ సంఖ్య పెంచారా? లేక ఏవైనా మూతబడిపోయిన థియేటర్లను తిరిగి పనులు పూర్తి చేసి స్టార్ట్ చేసేశారా? ఇలా ఎందుకు అడుగుతున్నాం అని అనుకుంటున్నారా? ఏటా సంక్రాంతికి ముందు వినిపించే ఓ డిస్కషన్ ఈ సారి ఇప్పటివరకు రాలేదు. రెండు, మూడు సినిమాలు రిలీజ్కి రెడీగా ఉంటేనే ఆ మాట వినిపించేది.. అలాంటి ఇప్పుడు ఏడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.. కానీ ఆ మాట వినిపించడం లేదు. అదే ‘థియేటర్లు / స్క్రీన్స్ సరిపోవు’.
ఇప్పుడు మీకు గుర్తొచ్చే ఉంటుంది.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్లో ఏటా సంక్రాంతికి ఈ టాపిక్ ఎంత పెద్ద రచ్చ చేసేదో. కానీ ఏమైందో ఈ సారి నిర్మాతలు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, నటులు కానీ ఈ టాపిక్ ఎక్కడా మాట్లాడటం లేదు. ఇప్పుడు ఇదే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కావాలంటే మీరూ ఆలోచిచండి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠంగా 1800 థియేటర్లు/ స్క్రీన్లు ఉన్నాయి. వాటిలో 7 సినిమాలు చేస్తే సినిమాకు పరిస్థితి ఎలా ఉంటుందో మీరే లెక్క చూసుకోవచ్చు. అయినా ఎవరూ థియేటర్ల గురించి మాట్లాడటం లేదు.
దీంతో, ఏమైందా అని చేస్తే పెద్ద సినిమాల మధ్య గ్యాపే అని అర్థమవుతోంది. 9వ తేదీ ప్రభాస్ – మారుతి ‘ది రాజాసాబ్’ వస్తోంది. అక్కడికి మూడు రోజులకు చిరంజీవి – అనిల్ రావిపూడి ‘మన శంకర వరప్రసాద్ గారు’ వస్తోంది. ఈ గ్యాప్ కారణంగా చిరంజీవికి థియేటర్లు సులభంగా దొరుకుతాయి. ఇక తర్వాత వచ్చే రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ మిగిలిన థియేటర్లను సర్దుకుంటాయి.
కోలీవుడ్ నుండి వస్తున్న ‘జననాయగన్’, ‘పరాశక్తి’కి మల్టీప్లెక్సుల్లో తప్ప.. బయట స్క్రీన్లు దొరకడం, వాళ్లు ఆశించడం ఇబ్బందే. ఈసారి సంక్రాంతికి లాంగ్ వీకెండ్ దొరడడమే థియేటర్ల పంచాయితీ రాకపోవడానికి కారణం అని చెప్పొచ్చు. ఒకవేళ ఇదంతా కాకుండా ఈసారి ఆ టాపిక్కే వద్దని సినిమా వాళ్లు అనుకున్నారేమో తెలియదు.