Vijay Devarakonda: భారీ యాక్షన్‌కి సిద్ధమైన విజయ్‌.. ఆ దేశంలో 40 రోజులపాటు..

  • July 3, 2024 / 11:34 AM IST

ఇటీవల ‘కురుక్షేత్రం’లో యుద్ధం చేసిన విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) ఇప్పుడు లంకకు వెళ్లి యుద్ధం చేయబోతున్నాడు. ఈ మేరకు త్వరలో శ్రీలంక ప్రయాణం చేయనున్నాడు. ‘కురుక్షేత్రం’ అంటే ఏంటో, ఏ సినిమా గురించి మీకు అర్థమయ్యే ఉంటుంది. ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)  సినిమాలో అర్జునుడి పాత్రలో కనిపించి అలరించాడు విజయ్‌ దేవరకొండ. అందులోనే ఆ సన్నివేశం ఉందనే విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు శ్రీలంక వెళ్లి కొత్త సినిమా కోసం యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించబోతున్నాడట.

విజయ్‌ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సత్యదేవ్‌ (Satya Dev) ఓ కీలక పాత్రధారి. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను త్వరలో స్టార్ట్‌ చేస్తారట. దీని కోసమే లంక పయనం. ఇటీవల విశాఖపట్నంలో కీలక షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న విజయ్‌ దేవరకొండ – గౌతమ్‌ తిన్ననూరి.. 40రోజుల పాటు యాక్షన్‌ షెడ్యూల్‌ చేయడానికి రెడీ అవుతున్నారట.

దాంతోపాటు కీలక తారాగణంపై సన్నివేశాల చిత్రీకరణ కూడా ఉంటుందట. అయితే ఆ సన్నివేశాల కోసం శ్రీలంక ఎందుకు వెళ్తున్నారు, అక్కడ అంతటి స్పెషల్‌ షూటింగ్‌ స్పాట్స్‌ ఏమున్నాయి అనేది టీమే చెప్పాలి. చాలా నెలల క్రితమే మొదలైన ఈ సినిమాను విజయ్‌ దేవరకొండ ఇతర సినిమాల కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు.

ఇటీవల షూటింగ్‌ స్పీడ్‌ చేసి.. ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో సిద్ధమవుతున్న ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రిలీజ్‌ చేస్తారు. తొలి పార్టు రిలీజ్‌ డేట్‌ను త్వరలో అనౌన్స్‌ చేస్తారు. రెండు పార్టులంత కథ ఇందులో ఉందా అంటే ఉందీ అనే అంటోంది సినిమా టీమ్‌.

ఇక చాలా ఏళ్లుగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న విజయ్‌కి, ‘జెర్సీ’ (Jersey) తర్వాత ఆశించిన ఫలితం ఇచ్చే సినిమాలు చేయని గౌతమ్‌ తిన్ననూరికి ఈ సినిమా ఫలితం చాలా కీలకం అని చెప్పాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus