26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అడివి శేష్ ‘మేజర్’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ కథానాయకుడు మహేష్బాబు నిర్మాతగా రూపొందిన ఆ సినిమా అవార్డులు, రివార్డులు గెలుచుకుంది. ఆ సినిమా షూటింగ్కి ముందు ఉన్ని కృష్ణ్ కుటుంబాన్ని సినిమా టీమ్ అంతా కలిసింది. హీరో అడివి శేష్ అయితే ఆ ఫ్యామిలీకి బాగా అటాచ్ అయిపోయాడు. ఈ క్రమంలో మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు శేష్.
‘మేజర్’ సినిమా మూడేళ్ల క్రితం వచ్చినప్పుడు ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులకు ఎప్పటికీ కుమారుడిలా ఉంటానని మాటిచ్చాడు. అప్పటి నుండి ఏటా నవంబర్ 26న (26/11 దాడులు జరిగిన రోజు) మేజర్ కుటుంబాన్ని కలుస్తున్నారు. ఈ ఏడాది కూడా శేష్ మేజర్ తల్లిదండ్రులను కలిశారు. ముంబయిలోని ఉన్నికృష్ణన్ స్మారకచిహ్నం వద్ద ఆయన కుటుంబంతో కలసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శేష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మేజర్ ఉన్నికృష్ణన్ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోకూడదని అనుకున్నాం. మా అమ్మ, అంకుల్కు అదే ప్రమాణం చేశాను. నేను ఏ సినిమా చేస్తున్నా, వీరితో అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను, ఉంటాను కూడా. వీరితో నేను ఉంటున్నానంటే మేజర్ జ్ఞాపకాలు సజీవంగా ఉన్నట్లే అనిపిస్తుంది. మన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను ఎప్పటికీ మర్చిపోకూడదు అని అడివి శేష్ అన్నాడు. ఈ క్రమంలో మేజర్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులతో దిగిన ఫొటోలను శేష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఇక అడివి శేష్ ప్రజెంట్ సినిమాల సంగతి చూస్తే.. ‘డెకాయిట్’, ‘గూఢచారి 2’ సినిమాల్లో నటిస్తున్నాడు. ‘డెకాయిట్’ సినిమా రొమాంటిక్ యాక్షన్ జోనర్ కాగా.. ఈ సినిమాను షానీల్ డియో తెరకెక్కిస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 19న విడుదల చేయాలని చూస్తున్నారు. ఇక ‘గూఢచారి 2’ విషయానికొస్తే వామికా గబ్బి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది మేలో తీసుకొస్తారట.