తెలుగు సినిమాలో చాలా అంశాలను పరిశ్రమను స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు శాసిస్తారు అని అనుకుంటూ ఉంటాం కానీ.. అసలు అక్కడ జరుగుతోంది వేరు అని అంటుంటారు సన్నిహితులు. గతంలో వేర్వేరు అంశాలు కంట్రోల్ చేసినా ఇప్పుడు చాలా వరకు బాలీవుడ్కి చెందిన కొన్ని ఘోస్ట్ నిర్మాణ సంస్థలు, ఓటీటీ సంస్థలే డీల్ చేస్తున్నాయి. వాటి లెక్క ప్రకారమే సినిమాల రిలీజ్ డేట్లు మారుతున్నాయి. కొన్ని సినిమాలు కంగారు కంగారుగా చుట్టేయడానికీ వాళ్ల డెడ్లైన్లే కారణం అని చెబుతున్నారు.
ఈ క్రమంలో బాలీవుడ్ ఘోస్ట్ నిర్మాణ సంస్థ పెట్టిన పంచాయితీ కారణంగా వచ్చే సంక్రాంతికి రావాల్సిన ఓ పాన్ ఇండియా స్టార్ సినిమా ఇబ్బందులు పడుతోంది. ఆ విషయం అటుంచితే ఓటీటీ సంస్థలు ఇటీవల ఓ రూల్ని తీసుకొచ్చాయని టాక్. బయటకు అఫీషియల్గా ఆ విషయం చెప్పకపోయినా.. ఆ రూల్ బుక్ సిద్ధమైందని, దాని ఆధారంగా రిలీజ్ కాబోతున్న తొలి సినిమా ‘అఖండ 2: తాండవం’ సినిమా అని టాలీవుడ్ టాక్. ఆ రూల్ వల్ల సినిమా పరిశ్రమకు మంచిదా కాదా అనేది తర్వాత.. తొలుత రూల్ చూద్దాం.
సినిమా విడుదలకు ముందు, ఇంకా చెప్పాలంటే నిర్మాణ దశలో ఉండగానే ఓటీటీ సంస్థలు ప్రాజెక్ట్లోకి వస్తున్నాయి / రప్పిస్తున్నారు. ఈ మేరకు అగ్రిమెంట్లు కుదర్చుకుంటున్నారు. ఓటీటీ రైట్స్ కోసం ఓ అమౌంట్ అనుకుంటున్నారు. వాటి ప్రకారం థియేటర్లలో సినిమా బాగా ఆడకపోతే అగ్రిమెంట్ అమౌంట్లో సుమారు 25 శాతం తగ్గిస్తారు. సినిమా బాగా ఆడితే అనుకున్న అమౌంట్కి 25 శాతం పెంచుతారు. నెట్ఫ్లిక్స్తో ఈ రూల్తో అగ్రిమెంట్ కుదుర్చుకున్న ‘అఖండ 2: తాండవం’ సినిమా త్వరలో రానుంది. ఈ రూల్తో వస్తున్న తొలి సినిమా ఇదే అంటున్నారు.
అంటే నిర్మాతకు ఓటీటీ సంస్థ నుండి డబ్బు రావడం ఇకపై పూర్తిగా సినిమా ఫలితం మీదే ఆధారపడి ఉంది. మరి ప్రేక్షకులు ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారో చూడాలి.