బాహుబలి.. ఈ ఒక్క మూవీ సీరీస్ తో ఆర్కా మీడియా శోభు, ప్రసాద్ పేర్లు ఇండియన్ సినిమా హిస్టరీలో నిలిచిపోయాయి. 2000 కోట్లకు పైగా వసూళ్లు, పాన్ ఇండియా అనే పదానికి ఊపిరి పోసిన ఘనత వారిది. ఆ సినిమా తర్వాత, ఈ నిర్మాతల నుంచి మరో అద్భుతం వస్తుందని దేశమంతా ఏడేళ్లుగా ఎదురుచూస్తోంది. కానీ, నేటికీ ఆ స్థాయి ప్రాజెక్ట్ వారి నుంచి అనౌన్స్ కాలేదు.
డబ్బుకు లోటు లేదు, స్టార్ హీరోల డేట్స్ దొరకవన్న సమస్య లేదు. అయినా ఎందుకీ నిశ్శబ్దం? ఇండస్ట్రీ విశ్లేషకుల మాట ప్రకారం.. ‘బాహుబలి’ విజయం ఆర్కా మీడియాది ఎంత ఉందో, దర్శకుడు రాజమౌళిది అంతకుమించిన తపస్సు ఉంది. ఆ ఐదేళ్ల ప్రాజెక్ట్ తర్వాత, జక్కన్న ఫ్రీ బర్డ్ అయిపోయాడు. ‘RRR’ కోసం డీవీవీతో, ‘SSMB29’ కోసం మరో నిర్మాతతో చేతులు కలిపాడు. కానీ, ఆర్కా మాత్రం ‘బాహుబలి’ బ్రాండ్ దగ్గరే ఆగిపోయింది.
రాజమౌళి లాంటి విజన్ ఉన్న మరో దర్శకుడిని ఆర్కా మీడియా నమ్మలేకపోతోందా? లేక, ‘బాహుబలి’ని మించిన కథ దొరకలేదా? కారణం ఏదైనా, పాన్ ఇండియా మార్కెట్ను సృష్టించిన వారే, ఇప్పుడు ఆ రేసులో పూర్తిగా సైడ్ అయిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘బాహుబలి’ ఇచ్చిన లాభాలతో వారు ఏ స్టార్తో అయినా సినిమా చేయగలరు, కానీ ఆ స్థాయి రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది.
అయితే, వారు తెలివిగా తమ దారి మార్చుకున్నారు. ‘బాహుబలి’తో పోల్చి చూసే ఒత్తిడిని తప్పించుకోవడానికి, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ లాంటి చిన్న, కంటెంట్ ఉన్న సినిమాలు, ‘పరంపర’ లాంటి ఓటీటీ సిరీస్లతో బ్రాండ్ను నడిపిస్తున్నారు. ఇది ఒకరకంగా స్మార్ట్ బిజినెస్ మూవ్. కానీ, పాన్ ఇండియా ప్రేక్షకులు వారి నుంచి ఆశించేది ఇది కాదు.
ప్రస్తుతం ‘బాహుబలి‘ రెండు భాగాలను కలిపి రీ–రిలీజ్ చేస్తున్నారంటే, వారు ఇంకా ఆనాటి విజయం మీద, ఆ బ్రాండ్ వాల్యూ మీదే ఆధారపడుతున్నారని అర్థమవుతోంది. పాన్ ఇండియా ఆటను మొదలుపెట్టిన ఆర్కా, ఇప్పుడు కేవలం ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. రాజమౌళి స్థాయి విజన్తో మరో ప్రాజెక్ట్ సెట్ అయ్యే వరకు, వారి నుంచి మరో ‘అద్భుతం‘ ఆశించలేమేమో!