కొన్నేళ్ల క్రితంవరకు సినిమాలకి కొన్ని నెలలు మంచి సీజన్ గా, ఇంకొన్ని నెలలు ఆన్ సీజన్ గా పేర్కొనబడేవి. అయితే.. రాను రాను అవన్నీ మారిపోతున్నాయి. కంటెంట్ బాగుంటే చాలు విడుదలైన సీజన్ తో సంబంధం లేకుండా సినిమాలు ఆడేస్తున్నాయి. ఫిబ్రవరి అనేది పరీక్షల సమయం కాబట్టి నిర్మాతలు ఎందుకో కొంచం వెనుకడుగు వేసేవారు. అయితే.. అదే ఫిబ్రవరి & మార్చి ఇప్పుడు మేజర్ సీజన్లుగా మారిపోయాయి. అయితే.. ఎన్ని సినిమాలు వచ్చినా, కంటెంట్ బాగోకపోతే ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. ఈ విషయం మరోసారి రుజువైంది.
వాలెంటైన్స్ డే సందర్భంగా తెలుగులో దాదాపు 6 సినిమాలు విడుదలయ్యాయి. “ఫంకీ, కపుల్ ఫ్రెండ్లీ, నిలవే, అమరావతికి ఆహ్వానం, సీతా పయనం, స్కై” వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో రెండుమూడు సినిమాలు మాత్రమే ప్రేక్షకులకు తెలుసు. అందులో ముఖ్యమైనది “ఫంకీ”. నాగవంశీ-అనుదీప్-విశ్వక్ సేన్ కాంబినేషన్ సినిమా కాబట్టి కచ్చితంగా బాగుంటుంది అనుకున్నారు జనాలు. అయితే.. కనీస స్థాయి ఎంగేజింగ్ ఎలిమెంట్స్ లేకపోవడంతో నెగిటివ్ రివ్యూస్ రావడమే కాక కలెక్షన్లు కూడా దారుణంగా పడిపోయాయి.
ఇక సీతా పయనం సినిమాని పట్టించుకొనే నాథుడే లేకుండాపోయాడు. చాలాచోట్ల షోస్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఇక సైలెంట్ గా, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన “కపుల్ ఫ్రెండ్లీ” మాత్రం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరచడమే కాక, బాక్సాఫీస్ దగ్గర నిలదొక్కుకుంది. మరీ ముఖ్యంగా మండే టెస్ట్ లో కాస్త జనరంజకమైన కలెక్షన్లు సాధించిన ఏకైక చిత్రంగా కూడా నిలిచింది.
సినిమా టీమ్ కూడా జనాల్లోకి వెళ్తూ ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు. సో, వీకెండ్ వాలెంటైన్స్ డే విన్నర్ గా “కపుల్ ఫ్రెండ్లీ”నీ ప్రకటించడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దశాబ్దం అనంతరం సంతోష్ శోభన్ ఎట్టకేలకు ఒక థియేట్రికల్ కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఇకనుండి అతడి జర్నీ ఇంకాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే.. మోస్ట్ డిజర్వింగ్ యంగ్ హీరోగా నిలబడగలడు.