రెండువైపులా పదును ఉన్న కత్తి లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మంచికి కాకుండా చెడుకు వాడుకుంటున్నారు. ఈ విషయంలో ఎవరు ఎంత చెప్పినా తమ ‘టాలెంట్’ చూపిస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. ఈ క్రమంలో సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలను మార్ఫ్ చేసి నెటిజన్లకు తప్పుడు సమాచారం చేరవేస్తున్నారు. దీంతో సెలబ్రిటీలు కోర్టును ఆశ్రయిస్తున్నారు. తమ ఫొటోలు, వీడియోలను తమ అనుమతి లేకుండా వినియోగించకూడదు అని న్యాయస్థానాల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటుడు చిరంజీవి కూడా కోర్టుకెళ్లారు. తాజాగా దీనిపై న్యాయస్థానం తీర్పునిచ్చింది.
చిరంజీవి అనుమతి లేకుండా అతని పేరు, ఫొటో, వాయిస్ను ఎవరూ వాడకూడదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. AI మార్ఫింగ్, వాయిస్ సింథసైజ్ ద్వారా కొంతమంది వీడియోలు, ఫొటోలు సృష్టించి తన ప్రతిష్ట దెబ్బతీస్తున్నారని చిరంజీవి ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. టీఆర్పీ, లాభాల కోసం చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఈ క్రమంలో న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది.
Mega Star, Chiru, Annayya పేర్లతో AI ద్యారా మార్ఫింగ్ పోస్టులు, వీడియోలను క్రియేట్ చేసిన 30 మందికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 27కి వాయిదా వేసింది. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ సీపీ సజ్జనార్ కలిసినప్పుడు చిరంజీవి ఇదే విషయమై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ తరహాలో కేసులు, కోర్టు తీర్పులు మనం టాలీవుడ్ సెలబ్రిటీల విషయంలో చూశాం. కొన్ని రోజుల క్రితం ప్రముఖ నటుడు నాగార్జున కూడా ఇలా కోర్టుకెళ్లిన విషయం తెలిసిందే.