టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు (Dil Raju) మీడియా ముందుకొచ్చి తన ఆవేదనను, ఆగ్రహాన్ని ఒకేసారి వెళ్లగక్కారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో థియేటర్ల పంపకాల దగ్గర నుంచి పైరసీ వరకు అనేక సమస్యలు కుంపటిలా రగులుతుంటే, కొందరు చేస్తున్న నీచపు ఆరోపణలు తనను తీవ్రంగా గాయపరిచాయని ఆయన వాపోయారు. ముఖ్యంగా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా పైరసీ విషయంలో, సాటి నిర్మాతే తనపై బురద చల్లే ప్రయత్నం చేయడంపై దిల్ రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
దిల్ రాజు మాట్లాడుతూ… “నా సినిమాను నేనే పైరసీ చేసుకుంటానా? కన్నకొడుకుని కడతేర్చాలని ఏ తండ్రైనా కోరుకుంటాడా? బుద్ధి ఉన్న వాడెవడూ ఇలాంటి పనికిమాలిన ఆరోపణలు చేయడు” అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పైరసీ వల్ల నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా తనకు ఎంత నష్టం వాటిల్లుతుందో తెలియదా అని ప్రశ్నించకుండానే సమాధానమిచ్చారు.పరిశ్రమలో సమన్వయం పూర్తిగా లోపించిందని, ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్లుగా వ్యవహారాలు నడుస్తున్నాయని దిల్ రాజు ఆక్షేపించారు.
థియేటర్ల సమస్యలపై చర్చించకుండానే ‘బంద్’ అంటూ ప్రకటనలు రావడం, ఛాంబర్లో ఇచ్చిన మాటలకు విలువలేకుండా పోవడం వంటివి ఇండస్ట్రీ దుస్థితికి అద్దం పడుతున్నాయన్నారు. “ఆ నలుగురు” అంటూ మీడియాలో వస్తున్న కథనాలపై కూడా ఆయన స్పందిస్తూ, వాస్తవాలు తెలుసుకోకుండా రాయడం తగదని హితవు పలికారు. గోదావరి జిల్లాల్లో ఎగ్జిబిటర్ల వివాదం సద్దుమణగడంలో మంత్రి దుర్గేష్ జోక్యం కీలకమని, ఆయన చొరవతోనే సమస్యకు తాత్కాలికంగా తెరపడిందని కృతజ్ఞతలు తెలిపారు.
ఏదేమైనా, పరిశ్రమలో ఐక్యత లేకపోవడం, ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం వంటివి చూస్తుంటే, ఇండస్ట్రీ ఎటుపోతుందోనన్న ఆందోళన దిల్ రాజు మాటల్లో స్పష్టంగా కనిపించింది. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే, ఇండస్ట్రీ పెద్దన్నగా తన ఆవేదనను ఆయన పంచుకున్నారనిపిస్తోంది.
ఇండివిడ్యువల్ గా టార్గెట్ చేయడం కాదు
‘గేమ్ ఛేంజర్’ పైరసీ విషయంలో నీచంగా ప్రవర్తించారు#DilRaju #GameChanger #RamCharan pic.twitter.com/uKJU2oMY6v
— Filmy Focus (@FilmyFocus) May 26, 2025