సినిమాకు సీక్వెల్ను సిద్ధం చేసేటప్పుడు నిర్మాత మారడం చూసుంటారు, దర్శకుడు మారడం చూసుంటారు, హీరోయిన్లు మారడం చూసుంటారు. కానీ హీరో మారడం చూశారా? అన్నీ అనుకున్నట్లుగా జరగకపోతే ఇప్పుడు హీరో మారతాడు అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. నిజానికి ఆ సినిమా తొలి భాగం ఆ హీరోకు కెరీర్ను తిరిగి ట్రాక్లో ఎక్కించింది. దీంతో ఒక విధంగా హీరోకు ఇది షాకే అని చెప్పొచ్చు.
ఇంత హైప్ ఇస్తున్నారు ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా? కిరణ్ అబ్బవరం కెరీర్ను మళ్లీ నిలబెట్టిన ‘క’. 2024 దీపావళి కానుకగా విడుదలైన ‘క’ రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుంది అని ఇప్పటికే టీమ్ ప్రకటించింది. ఇన్నాళ్లూ కిరణ్ అబ్బవరం బిజీగా ఉండటం వల్ల సినిమా పనులు ఆలస్యమవుతున్నాయి అనుకున్నారంతా. కానీ ఈ సినిమా ఆయన ఉండకపోవచ్చు అని సినిమా నిర్మాత చింతా గోపాలకృష్ణా రెడ్డి చెప్పారు.
‘శ్రీ చిదంబరం గారు’ సినిమా ప్రచారంలో భాగంగా చింతా గోపాలకృష్ణా రెడ్డి మాట్లాడుతూ ‘క’ సినిమా సీక్వెల్ గురించి కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ‘క 2’ సినిమాను 2027 జనవరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని, దీనికి కూడా సుజీత్ – సందీప్ దర్శకత్వం వహిస్తారని స్పష్టం చేశారు. అయితే, హీరో విషయంలో దర్శకులే తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కథ డిమాండ్ చేస్తే హీరో మారే అవకాశం కూడా ఉందని చెప్పారు.
ప్రస్తుతం ‘క’ సీక్వెల్కు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. తొలి భాగం ముగింపులో హీరో పాత్రతోనే సీక్వెల్ ముచ్చట చెప్పించారు. అయితే ఇప్పుడు హీరో ఉండకపోవచ్చు అని నిర్మాత అంటున్నారు అంటే వేరే కథ అనుకొని ఉండాలి. లేదంటే టీమ్ మధ్యలో ఏదైనా ఆలోచన మారి ఉండాలి. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే కిరణ్ అబ్బవరం స్పందించాలి. చూద్దాం ఏమన్నా చెబుతారేమో.