దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్ డైరక్టర్ కామెంట్స్ వైరల్
- April 7, 2026 / 08:45 PM ISTByFilmy Focus Desk
సినిమాలతో ఆలోచింప జేయడంలో సిద్ధహస్తుడు ఇంతియాజ్ అలీ. ఆయన ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాలు చాలా వరకు అలా ఆలోచింపజేసేవే. సమాజం గురించి, సమాజంలోని వైవిధ్యమైన అంశాల గురించి ఆయన తెరకెక్కించే సినిమాలు బాక్సాఫీసు దగ్గర కూడా భారీ విజయాలు అందుకుంటాయి. ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న సినిమా ‘మై వాపస్ ఆవూంగా’. దిల్జీత్ దోసాంజ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా జూన్ 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన కొన్ని కామెంట్స్ వైరల్గా మారాయి.
Imtiaz Ali
దేశ విభజనపై సినిమా తీయాలని ఎప్పుడూ అనుకోలేదు. జరిగిన ఒక సంఘటన గురించి అందరికీ చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను అంటూ ‘మై వాపస్ ఆఊంగా’ సినిమా గురించి చెప్పుకొచ్చారాయన. 1947 నాటి కథే అయినా నేటి యువత దృష్టి కోణం నుండి సినిమా కథను చెప్పే ప్రయత్నం చేశాను అని చెప్పారు. ఆ లెక్కన ఈ సినిమాఒక వ్యక్తి కథ మాత్రమే కాదు.. ఒక దేశం కథ కూడా అంటూ నాటి పరిస్థితుల్ని తనదైన కోణంలో వివరిస్తున్నా అని చెప్పకనే చెప్పారు ఇంతియాజ్ అలీ.

భారత ఉపఖండంలో జరిగిన అత్యంత ముఖ్యమైన సంఘటన దేశ విభజన. కానీ 78 ఏళ్ల తర్వాత ఇప్పుడు 1947 నాటి జ్ఞాపకాలలోకి మనం వెళ్లినప్పుడు.. అప్పటి అంశాలు చాలానే కనిపిస్తాయి. అదే ఈ సినిమా కథ అని చెప్పారు. అంటే అప్పటి సున్నితమైన అంశాలను ఆయన టచ్ చేసినట్లే. అయితే ఏం చెప్పారు అనేదే ఇక్కడ పాయింట్. ఈ సినిమా కథ రాస్తున్నప్పుడు దిల్జీత్ దోసాంజ్ గురించి ఆలోచించలేదని, కానీ ఆ పాత్రకు ఆయన కంటే సరిపోయే నటుడు, గాయకుడు మరొకరు దొరకలేదని చెప్పారు.

ఇంతియాజ్ – దిల్జీత్ కాంబినేషన్లో రూపొందిన ‘అమర్ సింగ్ చమ్కీలా’ సినిమా ఎంతటి విజయం అందుకుందో మీకు తెలిసిందే. రెండేళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా తర్వాత ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన పూర్తి స్థాయి సినిమా ఇదే కావడం గమనార్హం.












