అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చినా.. ఇతర వారసుల్లా తన తల్లి సినిమాలను, పాటలను ఇప్పటివరకు మళ్లీ చేయకుండా యూనిక్నెస్ పాటిస్తూ వస్తోంది జాన్వీ కపూర్. అయితే ఇప్పుడు తొలిసారి తన తల్లి సినిమాను రీమేక్ చేయాలని అనుకుంటోందని టాక్. ఇటీవల జాన్వీ కపూర్ ముందుకు ఓ రీమేక్ ప్రతిపాదన వచ్చిందట. శ్రీదేవి నటించిన క్లాసిక్ హిట్ ‘చాల్ బాజ్’నే రీమేక్ చేద్దాం అనుకుంటున్నారట. అయితే దీనికి జాన్వీ ఓకే చెప్పిందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
శ్రీదేవి డ్యూయల్ రోల్లో నటించిన ఈ ‘చాల్ బాజ్’లో రజనీకాంత్, సన్నీ డియోల్ హీరోలుగా నటించారు. 1989లో వచ్చిన ఈ సినిమాకు మూలం మన వాణిశ్రీ నటించిన ‘గంగ మంగ’, హేమమాలిని ప్రధాన పాత్రలో వచ్చిన ‘సీతా ఔర్ గీతా’. ఈ సినిమా శ్రీదేవి కెరీర్లో చాలా కీలకంగా నిలిచింది అని అప్పటి ఆమె అభిమానులు చెబుతుంటారు. నటన పరంగా ఆమెను మరో స్థాయిలో నిరూపించిన సినిమా అది. ఇప్పుడు ఆ సినిమాను జాన్వీ తిరిగి చేస్తే కచ్చితంగా పోలికలు వస్తాయి.
జాన్వీ ఏం చేసినా, ఏం మాట్లాడినా ట్రోలింగ్ భారీగా జరుగుతున్న రోజులివి. ఈ సమయంలో తల్లి సినిమా ‘చాల్ బాజ్’ చేస్తే ట్రోలర్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తారు మరి. ఇక ఈ సినిమాను ఎవరు నిర్మిస్తారు అనేది కూడా ఇంకా తేలడం లేదు. ఎందుకంటే ఈ సినిమాను నిర్మించింది తెలుగు సినిమా నిర్మాత ఎ.పూర్ణచంద్రరావు. జాన్వీ విషయం పక్కన పెడితే అప్పట్లో స్టార్లు నటించిన ఈ సినిమాలోని పాత్రలను ఇప్పుడు ఎవరు పోషిస్తారు, ఎంతవరకు మెప్పిస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
మరి జాన్వీ ఏం నిర్ణయం తీసుకుంటుందో, నిర్మాత ఎవరవువతారో, ఎవరు డైరెక్ట్ చేస్తారో, ఎలా వస్తుందో చూడాలి. మరోవైపు జాన్వీ కెరీర్ ఇప్పుడేం బాగోలేదు. ఏ సినిమా చేసినా సరైన ఫలితం రావడం లేదు. వచ్చిన మంచి కమర్షియల్ ఫలితాల్లో ఆమె వాటా తక్కువగానే ఉంటోంది.