రెండు బ్లాక్బస్టర్ సినిమాలు అందించిన దర్శకుడి నుండి అదే సినిమా సిరీస్లో మూడో సినిమా వస్తోంది అంటే.. ఎంతటి అంచనాలు ఉంటాయో మీకు తెలిసే ఉంటుంది. అందులో ఆ సినిమా కథను ఇతర భాషల్లోనూ రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్బస్టర్ విజయాలు అందుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆ దర్శకుడు మూడో సినిమా కోసం ఎలాంటి అంచనాలు పెట్టుకోవద్దు అంటూ సున్నితంగా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీరనుకున్నట్లుగా సినిమా ఉండదు.. అలా అనుకుని థియేటర్లకు రావొద్దు అని తేల్చేశారు.
మోహన్లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్లో రూపొందిన ‘దృశ్యం’ గురించే మేం చెబుతున్నది. ఈ సిరీస్లో ఇప్పటివరకు వచ్చిన ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ సినిమాలు భార విజయాలే అందుకున్నాయి. దీంతో మూడో భాగం ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఇతర భాషల్లో సినిమా కథ మీరిచ్చేస్తే మేం చేసేస్తాం అని కూడా అంటున్నారు. ‘దృశ్యం 3’ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది. గతంలో రెండు భాగాల విషయంలో ఎంతో ఆనందంగా ఉన్నాను. మూడో పార్ట్ భిన్నంగా ఉంటుంది. రెండో భాగంలో ఉన్న హై ఇంటెలిజెన్స్ సీన్స్ ఇందులో ఉంటాయని అంచనాలు పెట్టుకోవద్దు అని చెప్పారాయన.
మూడో ‘దృశ్యం’ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభిస్తాం. స్క్రిప్ట్ను 5 రఫ్ కాపీలు రాసుకున్నాను. ఏప్రిల్లో యూరప్ ట్రిప్కి వెళ్లినప్పుడు స్క్రీన్ప్లే రాశాను. దుబాయికి విమానంలో వస్తున్నప్పుడు సీన్ల ఆర్డర్ రాసుకున్నాను. ఒక్కోసారి తెల్లవారుజామున 3.30కి లేచి సీన్స్ రాశాను అంటూ ఈ సినిమా ఎలా సిద్ధమైంది అనే వివరాలు చెప్పుకొచ్చారు జీతూ జోసెఫ్. అంతగా సినిమా గురించి చెప్పిన ఆయన.. ఎందుకు అంచనాలు వద్దు అంటున్నారో మాత్రం చెప్పలేదు. సినిమా మీద హైప్ను తగ్గించే క్రమంలోనే ఇలా మాట్లాడారు అనిపిస్తోంది.
ఎందుకంటే మలయాళంలో మోహన్లాల్, తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగణ్, తమిళంలో కమల్ హాసన్ నటించిన ఈ సినిమాలకు ఆయా భాషల్లో భారీ విజయం దక్కింది. ఇప్పుడు మూడో ‘దృశ్యం’ మలయాళం, హిందీ, తెలుగులో ఒకేసారి తెరకెక్కుతుంది అని చెబుతున్నారు.