ప్రముఖ యువ కథానాయకుడు నిఖిల్ (Nikhil) కొత్త సినిమా షూటింగ్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ‘ది ఇండియా హౌస్’ సినిమా సెట్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్లోని శంషాబాద్ సమీపంలో ‘ది ఇండియా హౌస్’ సినిమా కోసం ఓ భారీ సెట్ రూపొందించారు. సముద్రం మధ్యలో జరిగే సన్నివేశాలు తెరకెక్కించేందుకు ఏర్పాటు చేసిన ఈ సెట్లో భారీ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు.
అక్కడే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి ఆ సెట్లో సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ట్యాంక్ పగిలిపోయింది. దీంతో ఒక్కసారిగా నీరు వరదగా సెట్లోకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో అసిస్టెంట్ కెమెరామన్ సహా పలువురు సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో వారికి ప్రాథమిక చికిత్స అందించి ఆస్పత్రికి తరలించారు.
సినిమా షూటింగ్ కోసం సిద్ధం చేసిన సామగ్రి నీటిలో పూర్తిగా తడిచిపోయింది. ప్రస్తుతం ఈ ప్రమాద ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సమర్పణలో నిఖిల్ – సయీ మంజ్రేకర్ జంటగా రూపొందుతున్న సినిమా ‘ది ఇండియా హౌస్’. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ నిర్మిస్తున్నాయి.
రామ్ వంశీకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 1905 నేపథ్యంలో ప్రేమ, విప్లవం అంశాలతో కూడిన కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.
హీరో నిఖిల్ సినిమా షూటింగ్లో భారీ ప్రమాదం
ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్లో ఘటన
శంషాబాద్ సమీపంలో సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం వరద
అసిస్టెంట్ కెమెరామెన్ కు తీవ్ర గాయాలు.. మరికొంత మందికి గాయాలు! pic.twitter.com/M8snLFzzMq
— Filmy Focus (@FilmyFocus) June 11, 2025