గత కొన్ని నెలలుగా వ్యక్తిగత విషయాలు, వివాహ బంధం విషయాలతో వార్తల్లో నిలిచిన ప్రముఖ తమిళ నటుడు జయం రవి ఇప్పుడు మరో విషయంతో వార్తల్లోకి వచ్చారు. ఈ సారి కూడా వ్యక్తిగత విషయమే అయినా.. ఇది ఆర్థికపరమైన అంశం కావడం గమనార్హం. చేసిన అప్పులు తీర్చకపోవడంతో ఆయన ఇంటికి బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో మరోసారి ఆయన గురించి అందరూ మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది.
చెన్నైలోని ఇంజంబక్కంలో ఉంటున్న కథానాయకుడు రవి మోహన్ అలియాస్ జయం రవి ఇల్లు ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. దాన్ని వేలం వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆ ఇంటికి సంబంధించిన రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు నోటీసులు అంటించారు. ఈ ఇంటి కోసం ఆయన ఒక ప్రైవేటు బ్యాంక్ నుంచి పెద్ద మొత్తంలో రుణం తీసుకున్నారని.. నెలవారీ వాయిదాలు చెల్లించడం లేదని సమాచారం. ఈ బకాయి మొత్తంగా రూ.7.60 కోట్లకుపైగా మారిందట.
ఈ మేరకు నోటీసులో పూర్తి వివరాలు పేర్కొన్నారు. బ్యాంకు యాజమాన్యం రిమైండర్ లేఖలు పంపినా జయం రవి నుండి ఎలాంటి స్పందన లేకపోవంతోనే ఇప్పుడు నోటీసులు వరకు వచ్చిందని తెలుస్తోంది. ఇప్పటికీ ఆయన నుండి స్పందన లేకపోతే ఇంటిని బ్యాంకు అధికారులు వేలం వేస్తారు అని భోగట్టా. ఇదిలా ఉండగా రవి మోహన్పై టచ్ గోల్డ్ యూనివర్సల్ అనే నిర్మాణ సంస్థ సినిమాల విషయంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
తమ ప్రొడక్షన్ హౌస్లో రెండు సినిమాలు చేయడానికి జయం రవి రూ.6 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నాడని.. కానీ, ఆ సినిమాల్లో నటించకుండానే ఇతర ప్రాజెక్ట్లు అంగీకరించారని ఆ ఆరోపణల సారాంశం. ఈ నేపథ్యంలో రవి మోహన్ ఇంటిని జప్తు చేయాలని నిర్మాణ సంస్థ అభ్యర్థించిందని.. అందుకే అధికారులు వచ్చారు అని అంటారు. అయితే ఈ విషయంలో స్పష్టత లేదు. ఇక భార్యతో విడాకుల వ్యవహారం కూడా జయం రవి ఎదుర్కొంటున్నారు. దీనికితోడు కొత్త ప్రేమ బంధం కూడా ఉంది.