ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం చాలా పెద్ద విషయం. ఎప్పుడో భారీ సీజన్లో ఇలాంటివి జరుగుతుంటాయి. ఇలాంటి రోజులు చాలా తక్కువ. అలాగే ఒక హీరో సినిమాలు రెండు ఒకే రోజు రిలీజ్ అవ్వడం అయితే చాలా అరుదు. అయితే అప్పుడెప్పుడో రెట్రో టైమ్లోకి వెళ్లి లెక్కలేయకుండా.. రీసెంట్ టైమ్స్లో మాత్రమే చూస్తే ఇప్పటివరకు సౌత్ సినిమాలో కేవలం రెండు సినిమాలు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు మూడో సినిమా రెడీ అవుతోంది అని సమాచారం.
ప్రస్తుతం చిన్న హీరోలు, కుర్ర స్టార్ హీరోలు కూడా ఒకేసారి రెండు సినిమాల రిలీజ్కి సిద్ధమవ్వడం ఈ మధ్య కాలంలో చూడలేదు. అసలు రెండు సినిమాలను ఒకేసారి షూటింగ్ దశలో ఉండటం లేదు. ఆ విషయం పక్కన పెడదాం.. ఇప్పుడు ఒకే రోజు రెండు సినిమాలను రిలీజ్ చేస్తున్న హీరో ఎవరా అని చూస్తే.. ‘లవ్ టుడే’ సినిమాతో కుర్రకారులో సెన్సేషనల్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథనే డబుల్ రిలీజ్ చేయబోతున్న హీరో.
ప్రదీప్ రంగనాథన్ చేతిలో ఇప్పుడు రెండు సినిమాలు ఉన్నాయి. అవే ‘లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ – ఎల్ఐసీ’, ‘డ్యూడ్’. ఈ రెండు సినిమాల చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. మామూలుగా అయితే ఈ రెండు సినిమాలను నెల రోజుల గ్యాప్లో రిలీజ్ చేస్తారు. కానీ ఈ రెండు సినిమాల్ని ఒకే రోజు రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అక్టోబర్ 17న ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తాయట. మరి ఈ నిర్ణయం ఎంతవరకు ముందుకు వెళ్తుంది అనేది చూడాలి.
ఇక ఇలాంటి ఫీట్ రీసెంట్ టైమ్స్లో చేసింది ఇద్దరు హీరోలే. మొదటి హీరో నందమూరి బాలకృష్ణ. 1993లో సెప్టెంబర్ 3న ఆయన రెండు సినిమాలు ‘బంగారు బుల్లోడు’, ‘నిప్పురవ్వ’ ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఇక మార్చి 21, 2015న నాని సినిమాలు ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘జెండాపై కపిరాజు’ వచ్చాయి. ఇలా వచ్చిన రెండు సినిమాల్లో ఒకటే విజయం సాధించడం గమనార్హం.