మహేష్బాబు – రాజమౌళి – ప్రియాంక చోప్రా – పృథ్వీరాజ్ సుకుమార్.. ఈ కాంబినేషన్ వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఎందుకంటే ఇంతటి పెద్ద కాంబినేషన్ ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో చూడలేదు. దీనిని సాధ్యం చేస్తున్న సినిమా ‘వారణాసి’. ఇటీవల ఈ సినిమా టైటిల్ + మహేష్బాబు లుక్ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు భారీ బడ్జెట్ పెడుతున్నారు అని చెబితే జోకే అవుతుంది. ఎందుకంటే ఆ కాంబినేషన్ సెట్ అయిందంటేనే ఆ బడ్జెట్ వల్ల. అయితే బడ్జెట్ ఎంత అనేది ఇప్పటివరకు చెప్పలేదు. నిజానికి ఎవరూ చెప్పరు కూడా. కానీ ఇంత అనే పుకారు కూడా బయటకు రాలేదు.
అయితే, ఓ బాలీవుడ్ టీవీషోలో ఓ చిన్న రూమర్ బయటకు వచ్చింది. సినిమా హీరోయిన్ ప్రియాంక చోప్రా ఆ షోకి హాజరైంది. ఈ క్రమంలో సినిమా బడ్జెట్ గురించి చర్చ జరిగింది. సినిమాకు రూ.1300 కోట్ల బడ్జెట్ పెడుతున్నారట కదా.. అని హోస్ట్ కపిల్ శర్మ అడగ్గా.. ప్రియాంక తెలివిగా సమాధానం చెప్పింది. తొలుత బడ్జెట్ గురించి రియాక్షన్గా కేవలం నవ్వులు చిందించిన ప్రియాంక.. ఆ తర్వాత ‘నువ్వు ప్రాజెక్టులో జాయిన్ అయిన తర్వాతే బడ్జెట్ పెరిగిందట నిజమేనా?’ అని అడగ్గా.. ‘అందులో సగం నా బ్యాంకు ఖాతాలోకి వెళ్లాయంటున్నావా?’ అని కౌంటర్ వేసింది.
ఇలా బడ్జెట్ ఎంత అనే విషయంలో ప్రియాంక క్లారిటీ ఇవ్వలేదు కానీ.. ప్రశ్న వేసిన కపిల్ శర్మనే క్లారిటీ ఇచ్చాడు అని చెప్పొచ్చు. సినిమా పరిశ్రమకు బాగా క్లోజ్ ఉండే కపిల్ అంత అమౌంట్ చెప్పాడంటే.. కచ్చితంగా ఆ నెంబరు నిజమే అని చెప్పొచ్చు. దానికి మించి ఇంత పెద్ద కాంబినేషన్, నేపథ్యం తెలిశాక ఆ డబ్బులు పెట్టి ఉంటారు అని చెప్పేయొచ్చు. ఇక ఇలాంటి విషయాల్లో సినిమా బృందాలు క్లారిటీ ఇవ్వవు కాబట్టి.. ఇప్పటికి ఇదే నిజం అనుకోవచ్చు. చూద్దాం ఇంకేమైనా లీకులు వస్తాయేమో. సినిమా షూటింగ్కి ఇంకా ఓ సంవత్సరం పట్టే అవకాశం ఉంది.