బాలీవుడ్ సినిమాలు అంటే ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్లు మాత్రమే నటించేవారు. సౌత్ నుండి ఎప్పుడో ఓసారి హీరోయిన్ వెళ్లి నటించేది. అలా నటించి వెంటనే వచ్చేసేది. కొందరు మాత్రం అక్కడకు వెళ్లి ఫిక్స్ అయి ఉండిపోతుంటారు. ఇంకొందరు అయితే అక్కడి నుండి ఇక్కడికి.. ఇక్కడి నుండి అక్కడికి షటిల్ సర్వీసులు తిరుగుతుంటారు. వీరిని పాన్ ఇండియా హీరోయిన్లు అని అంటున్నారు. అలాంటి హీరోయిన్ ప్రస్తుతం ఎవరైనా ఉన్నారా అంటే అది రష్మిక మందన మాత్రమే. అలా ఇప్పుడు ఆమె మరో సినిమా అవకాశం పట్టేసింది.
బాలీవుడ్కి వెళ్లి తొలి రోజుల నుండే అగ్ర హీరోల సినిమాల మీద కన్నేసిన రష్మిక మందన.. చిన్న హీరోలతో అస్సలు చేయడం లేదు. ‘యానిమల్’ సినిమా తర్వాత అయితే మరింతగా పరిస్థితి మారింది. అక్కడ ఓ పెద్ద సినిమా తెరకెక్కుతుండి.. ఆ సినిమాను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేసుకుందాం అంటే రష్మిక మందనను హీరోయిన్గా తీసుకుంటున్నారు. మరి ఏ ఆలోచన వల్లో తెలియదు కానీ.. ‘క్రిష్ 4’ సినిమా కోసం రష్మికను తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయట.
‘క్రిష్’ ఫ్రాంచైజీలో నాలుగో భాగంగా ‘క్రిష్ 4’ సినిమాను త్వరలో ప్రారంభించనున్నారు. హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తూ.. దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయమవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశముందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది చిత్రీకరణను ప్రారంభిస్తామని చిత్ర వర్గాలు ఇప్పటికే తెలిపాయి. ఈ క్రమంలో హీరోయిన్ను ఫిక్స్ చేశారట. ఇక 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.
ఇటీవల ‘వార్ 2’ పనులు పూర్తి చేసుకొని, ఫలితం వచ్చాక ఢీలా పడిపోయిన హృతిక్ త్వరలో ‘క్రిష్ 4’కి రెడీ అవుతాడట. మధ్యలో ‘ఆల్ఫా’ సినిమాలో చిన్న అతిథి పాత్ర చేయాల్సి ఉందట. అది అయ్యాకనే ‘క్రిష్ 4’ వైపు వస్తాడట.