ఎలివేషన్లు.. ఇప్పుడు మాస్ సినిమాకు పర్యాయ పదంగా మారాయి. అభిమానులు తమ హీరోకు ఎవరికీ దక్కని రేంజిలో ఎలివేషన్ సీన్స్ పడాలని కోరుకుంటున్నారు. తమ శాయశక్తులా దర్శకులకు ఈ విషయాన్ని కన్వే చేయాలని చూస్తున్నారు. నిజానికి మాస్ హీరోకు ఎలివేషన్ సీన్స్ కొత్తేమీ కాదు. ఎన్నో దశాబ్దాలుగా మాస్ హీరోల ఎలివేషన్ సీన్స్ మన తెలుగు సినిమాలో ఉన్నాయి. వాటిని ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో ముఖ్యంగా ప్రశాంత్ నీల్ సినిమాలు వచ్చాక ఎక్కువయ్యాయి. వాటి మీదే సినిమా నడుస్తోందనే ఓ చిన్న విమర్శ కూడా ఉంది.
ఇటీవల వచ్చిన ‘ఓజీ’ సినిమా గురించి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాట్లాడుకునేటప్పుడు తొలుత వస్తున్న చర్చ ఎలివేషన్ సీన్సే. సినిమాలో కీలక సమయాల్లో ఆ సీన్స్ రావడంతో థియేటర్లలో సందడి మామాలూగా లేదు. ఈ సన్నివేశాల గురించి ఆ సినిమా సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అలాగే తెలుగు సినిమాపై ఆయన అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు. తెలుగు సినిమా అంటే ఒకప్పుడు డ్రామా, యాక్షన్, పాటలు గురించే మాట్లాడేవారని.. ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు.
ప్రస్తుతం తెలుగు సినిమాల విషయానికొస్తే.. ఇప్పుడు మూలాల్లోకి వెళ్లి కథలు చెబుతున్నారు. ప్రయోగాలు కూడా చేస్తున్నారు. దేశంలో ఇప్పుడు ఫ్రంట్ రన్నర్ తెలుగు సినిమానే అని చెప్పుకోవాఇ. భారతీయ చిత్ర పరిశ్రమని తెలుగు సినిమా ఇప్పుడు చాలా ప్రభావితం చేస్తోంది. యువ దర్శకుల ఆలోచనలు, కథలు బాగుంటున్నాయి. ఇక ఎలివేషన్స్, గ్రాండ్ విజువల్స్ ఈ మధ్య ఓ ట్రెండ్గా మారాయి. అయితే ట్రెండ్ అనేది ఫ్యాషన్ లాంటిదే. వస్తుంది, పోతుంది అని అన్నారు రవి కె చంద్రన్.
సినిమా పరిశ్రమలో ట్రెండ్ ఎప్పటికప్పుడు మారిపోతుంది. ఓ ప్రేమకథ వచ్చిన పెద్ద విజయాన్ని అందుకుందంటే అదే ట్రెండ్ అయిపోతుంది. అందరూ అటువైపుగా ఆలోచిస్తారు. అందుకే దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. అయినా ట్రెండ్ని పట్టుకుని విభిన్నమైన సినిమాను తీయలేం అని చెప్పారు రవి కె చంద్రన్.