నిర్మాణంలోకి దిగిన ప్రముఖ రచయిత
- June 27, 2018 / 01:46 PM ISTByFilmy Focus
సాయి మాధవ్ బుర్రా మాటలు నేరుగా హృదయాలకు తాకుతాయి. అందుకే అతను మాటలను అందించిన కృష్ణం వందే జగద్గురుమ్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, కంచె, గౌతమి పుత్ర శాతకర్ణి, ఖైదీ నంబర్ 150 , మహానటి.. సినిమాలు విజయతీరాన్ని చేరుకున్నాయి. ఇప్పుడు అతను బాలకృష్ణ నటిస్తూ, నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకి, మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి చిత్రాలకి మాటలను అందిస్తున్నారు. ఇంత బిజీలో ఉన్న రచయితకి నిర్మాణం వైపు మనసు లాగింది. తనకొచ్చిన ఆలోచనలను చిన్న చిత్రాలుగా మలచాలని కోరిక కలిగింది.
అందుకే అతను షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ నిర్మించాలని అటువైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఒక సిరీస్ కి కథ, మాటలను అందించారని, అది ప్రొడక్షన్ దశలో ఉన్నట్టు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఆ సిరీస్ వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి. కోలీవుడ్ లో డైరక్టర్ శంకర్ చిన్న సినిమాలను నిర్మిస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కొత్త ట్యాలెంట్ ని ప్రోత్సహిస్తున్నారు. అదే విధంగా తన స్థాయికి తగ్గట్టు సాయి మాధవ్ బుర్రా లఘు చిత్రాలను రూపొందిస్తున్నారు. ఈ వీడియోల ద్వారా పరిశ్రమకి ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ లభిస్తారనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.












