చిన్న పిల్లల సేఫ్టీ గురించి, వారిని ఎలా స్ట్రాంగ్గా ఉంచాలి అనే విషయాల గురించి సాయి తేజ్ వివిధ సందర్భాల్లో చెబుతుంటారు. గతంలో ఓ సందర్భంలో పిల్లల విషయంలో అభ్యంతరకర కామెంట్లు చేసిన యూట్యూబర్ల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఆ విషయాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి వారికి తగిన శాస్తి జరిగేలా చూశారు కూడా. ఇప్పుడాయన అభయం మసూమ్ – 25 అనే సమ్మిట్లో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న పిల్లల ఎక్స్, ఇన్స్టా ఖాతాలను ఆధార్ నెంబర్తో అనుసంధానం చేయాలని సాయి తేజ్ సూచించాడు. ఆధార్ కార్డు లింకు చేయడం వల్ల పిల్లలు, తల్లిదండ్రుల్లో భయం పెరుగుతుందని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో పిల్లల పట్ల అశ్లీలత, అసభ్యతను తగ్గించాలంటే ఆధార్ కార్డు జత చేయడం తప్పనిసరి చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో పిల్లల విషయం కొంతమంది చేసిన వ్యాఖ్యలకు వందలమంది కామెంట్స్, లైక్లు చేయడం అత్యంత విచారకరమని అన్నారు.
డార్క్ కామెడీ అని చెప్పి ఇలాంటివి మాట్లాడతారా? ఇతరుల సెంటిమెంట్ను దెబ్బతీసే హక్కు మీకు ఎక్కడది అని సాయి దుర్గా ప్రశ్నించారు. 2015లో ‘థింక్ పీస్’ అనే సంస్థతో పని చేశానని, అరకులో చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి పోరాడానని తెలిపారు. ఈ క్రమంలో అక్కడో స్కూల్ నిర్మించానని కూడా చెప్పారు. తెలంగాణలో కొంత మంది పిల్లల్ని దత్తత తీసుకున్నానని చెప్పారు. ఇక పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వాలని కోరారు. అన్ని విషయాలు పంచుకునేలా పిల్లలకు స్వేచ్ఛనివ్వాలన్నారు.
అదే సమయంలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ విషయాల్ని స్కూల్లో టీచర్స్, ఇంట్లో తల్లిదండ్రులు అర్థమయ్యేలా చెప్పాలి పిలుపునిచ్చారు. ప్రస్తుతం అందరూ బిజీగా మారిపోయారని, ఎప్పుడూ సోషల్ మీడియాలోనే ఉంటున్నారని.. వారంలో ఒక్క పూట అయినా ఫ్యామిలీతో గడపాలని కోరారు. ఫ్యాన్స్ మా మీద ఇష్టంతోనో, ద్వేషంతోనో సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుంటారు. మేమంటే పెద్ద అయ్యాం కాబట్టి అర్థం చేసుకుంటాం. కానీ పిల్లలు అలాంటి కామెంట్లను చూస్తే ప్రభావితమవుతారు. అందుకే పిల్లల్ని అలాంటి వాటికి దూరంగా ఉంచాలి అని కోరారు.