Jr NTR Land Dispute Issue: స్థలం వివాదం విషయంలో తారక్ ను ఇంతలా మోసం చేశారా?

  • May 17, 2024 / 05:33 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  తెలంగాణ హైకోర్టు మెట్లు ఎక్కడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. తారక్ కోర్టు మెట్లు ఎక్కారంటే చిన్న సమస్య కాదని ఆ సమస్య పెద్దదేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే తారక్ ను గీతాలక్ష్మి అనే మహిళ దారుణంగా మోసం చేసిన నేపథ్యంలో తారక్ కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని తెలుస్తోంది. స్థలం విషయంలో తారక్ దారుణంగా మోసపోయారని భోగట్టా.

జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 75లో తారక్ 2003 సంవత్సరంలో ఒక ఫ్లాట్ కొనుగోలు చేశారు. అయితే ఈ స్థలంపై గీతాలక్ష్మి అనే మహిళ ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి 1996లో వేర్వేరు బ్యాంకులలో లోన్ తీసుకున్నారు. మొత్తం ఐదు బ్యాంకుల నుంచి గీతాలక్ష్మి రుణం తీసుకోగా ఒకే ఒక్క బ్యాంక్ లో రుణం తీసుకున్నట్టు సమాచారం ఇచ్చి ఆమె తారక్ తో ఆ లోన్ క్లియర్ చేయించి 2003లో తారక్ కు ఆ స్థలాన్ని అమ్మేశారు.

అయితే స్థలం కొనుగోలు చేసిన తర్వాత తారక్ కు గీతాలక్ష్మి లోన్ తీసుకున్న ఇతర బ్యాంకుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి. 2019 సంవత్సరంలో ఈ వ్యవహారం విషయంలో పలువురు బ్యాంక్ మేనేజర్లపై తారక్ ఫిర్యాదు చేసినట్టు భోగట్టా. అయితే బ్యాంక్ అధికారులు డీఆర్టీ (డెట్ రికవరీ ట్రైబ్యూనల్) ను ఆశ్రయించగా అక్కడ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఆ తర్వాత తారక్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఈ పిటిషన్ ను జూన్ నెల 6వ తేదీకి వాయిదా వేసింది.

ఈ వివాదం విషయంలో రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం గీతాలక్ష్మిపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ మీడియా ముఖంగా మాత్రం ఇప్పటివరకు ఈ ఘటన గురించి స్పందించలేదు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం తారక్ ను ఇంతలా మోసం చేస్తారా అని కామెంట్లు చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus