‘వెళ్లవయ్యా వెళ్లు..’ అంటూ నితిన్ను (Nithin Kumar) ‘జయం’ (Jayam) సినిమాలో సదా ప్రేమలో పడేస్తుంది. ఆ మాట వల్ల, అందులో ఆమె నటన వల్ల, ఇద్దరి మధ్య ప్రేమ వల్ల ఆ సినిమా ఓ లెవల్లో విజయం అందుకుంది. సదాకు కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో, పెద్ద దర్శకుల సినిమాల్లో ఛాన్స్లు అందుకుంది. అయితే ఇదంతా దక్కాల్సింది ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్కి (Rashmi Gautam) అని తెలుసా. అవును మన యాంకర్ రష్మీనే ఆ సినిమాకు ఫస్ట్ ఎంపిక.
ఈ విషయాన్ని ఇన్నాళ్లూ చెప్పలేదు రష్మీ. అయితే నితిన్ చెప్పడంతో అందరికీ తెలిసింది. ప్రముఖ టీవీ ఛానల్లో ఉగాది ప్రత్యేక కార్యక్రమం ఒకటి నిర్వహించారు. దానికి ఓ హోస్ట్గా రష్మీ చేసింది. దానికి గెస్ట్ హీరో నితిన్ వచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్మీ – నితిన్ మధ్య చనువు చూసి ఇద్దరికీ ఎక్కడ పరిచయం అని అనుకుంటూ ఉన్నారు.
పూర్తి ఎపిసోడ్ వస్తే క్లారిటీ వస్తుంది అనుకున్నారంతా. అనుకున్నట్లుగానే ఆ ఎపిసోడ్ వచ్చింది. బంపర్ క్లారిటీ కూడా వచ్చింది. అదే ‘జయం’ సినిమా అని. ఆ సినిమాకు సదా (Sadha) కంటే ముందు అనుకున్న నాయిక రష్మీనే. రష్మీ పరిశ్రమలో అప్పుడప్పుడే అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. అలా ‘జయం’ సినిమా కోసం ఆమెను దర్శకుడు తేజ (Teja) సెలక్ట్ చేశారు.
హీరోయిన్గా సెట్స్లోకి రావడం నితిన్తో కలసి దాదాపు సినిమాకు సంబంధించిన ప్రధాన సన్నివేశాల రిహార్సల్స్ కూడా చేశారట. కానీ సినిమా షూటింగ్ దగ్గరకు వచ్చేసరికి హీరోయిన్గా సదా వచ్చిందట. ఎందుకు మారింది అనేది తెలియదు కానీ.. నిర్ణయం మాత్రం రష్మీకి వ్యతిరేకంగా వచ్చింది. అలా 20 ఏళ్ల క్రితమే నితిన్ – రష్మీ పరిచయస్తులే. ఆ సినిమా రష్మీ చేసి ఉంటే ఎలా ఉండేదో కదా?