‘పెళ్ళిచూపులు’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ‘ఈ నగరానికి ఏమైంది?’ (Ee Nagaraniki Emaindi) అనే యూత్ ఫుల్ మూవీ వచ్చింది. దీన్ని ‘సురేష్ ప్రొడక్షన్స్’ అధినేత సురేష్ బాబు నిర్మించారు. 2018 జూన్ 29 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో కలెక్ట్ చేసింది లేదు. ఓ యావరేజ్ సినిమాగా నిలిచిపోయింది. కానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాని ఎగబడి చూశారు.
ఇప్పటికీ యూత్ ఈ సినిమాని తెగ చూస్తారు. మొన్నామధ్య రీ రిలీజ్ చేస్తే.. మొదటి రిలీజ్లో కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. కానీ తర్వాత దాని గురించి ఎటువంటి చప్పుడు లేకపోవడంతో.. ఈ ప్రాజెక్టు ఆగిపోయింది అనుకున్నారు. మధ్యలో తరుణ్ భాస్కర్ చేసిన ‘కీడా కోలా’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ని సురేష్ బాబు పక్కన పెట్టారని అంతా అనుకున్నారు.
మరోపక్క విశ్వక్ సేన్ కూడా ఈ ప్రాజెక్టు కోసం భారీగా పారితోషికం డిమాండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు విశ్వక్ సేన్ కూడా ప్లాపుల్లో ఉన్నాడు. దీంతో కొన్ని ప్రాజెక్టులు పక్కన పెట్టి తరుణ్ భాస్కర్ తో చేతులు కలిపినట్టు తెలుస్తుంది. అలా మొత్తానికి ‘ఈ నగరానికి ఏమైంది?’ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్'(ENE Repeat) పేరుతో సెట్స్ పైకి వెళ్ళనుంది. ’35 : చిన్న కథ కాదు’ నిర్మాత సృజన్ యరబోలు.. ఈ సీక్వెల్ ను సురేష్ బాబుతో కలిసి నిర్మించనున్నారు.