సంక్రాంతి సీజన్కి మరో 20 రోజులు ఉంది. అందుకే చిత్రబృందాలు ప్రచారాన్ని ప్రారంభించేశాయి. అవును, ఇందులో ఇబ్బందేముంది మంచిదేగా అంటారా. నిజమే సినిమా ప్రచారం షురూ కావడం కరెక్టే. కానీ పరిస్థితి చూస్తుంటే వచ్చే సంక్రాంతికి సినిమా టికెట్ల కోసం థియేటర్ల దగ్గర పడే రద్దీ కంటే థియేటర్ల కేటాయింపు కార్యక్రమంలోనే ఎక్కువ రద్దీ వచ్చే అవకాశముంది. ఎందుకంటే ఆరేడు సినిమాలు రిలీజ్కి రెడీ అవుతున్నాయి. ఇందులో అన్నీ రావడం కష్టసాధ్యం. కాబట్టి ఎవరో ఒకరు డ్రాప్ అవ్వాల్సిందే. అది ఈ వారంలోనే తేలిపోతుంది అని సమాచారం.
టాలీవుడ్ నుండి ఈ సంక్రాంతికి రెడీగా ఉన్న సినిమాలు ఏవా అని చూస్తే.. రిలీజ్ డేట్ ఆర్డర్ ప్రకారం తొలుత ప్రభాస్ – మారుతి సినిమా ‘ది రాజా సాబ్’ జనవరి 9న రానుంది. ఆ తర్వాత 12న చిరంజీవి – అనిల్ రావిపూడి ‘మన శంకర్ వరప్రసాద్గారు’ వస్తుంది. 13వ తేదీని రీసెంట్గా రవితేజ తీసుకున్నాడు. ‘భర్త మహాశయులకువ విజ్ఞప్తి’ అంటూ ఆ రోజే వస్తానంటున్నాడు. ఈ సినిమాల తర్వాత ‘నారి నారి నడుమ మురారి’ సినిమాను రిలీజ్ చేస్తామని శర్వానంద్ ఇప్పటికే చెప్పేశాడు. ఈ నలుగురు కాకుండా నవీన్ పొలిశెట్టి – మీనాక్షి చౌదరి సినిమా ‘అనగనగా ఒక రాజు’ సినిమా కూడా పొంగల్ రేసులో ఉంది.

అంటే టాలీవుడ్ నుండి మొత్తంగా ఐదు సినిమా పొంగల్ ఫైట్లో ఉన్నాయి. ఇక తమిళనాడు నుండి రెండు సినిమాలు రెడీగా ఉన్నాయి. ఒకటో నెల 9న ‘జననాయకుడు’గా విజయ్ వస్తుండగా.. 14న శివకార్తికేయన్ తన ‘పరాశక్తి’ని తీసుకురాబోతున్నాడు. ఈ రెండూ వెనకడుగు వేసే ప్రస్తక్తే లేదు. దీంతో మొత్తంగా 7 సినిమాలు అయ్యాయి. ఒక వారం గ్యాప్లో ఇన్ని సినిమా థియేటర్లలోకి వస్తే కష్టమే. ఎవరికీ డబ్బులు రావు. అయితే ఇందులో ఎన్ని నిలిచాయనేది ఈ వారాంతంలో తేలిపోతుంది. లేదంటే థియేటర్ల పరిస్థితి తేల్చుకోలేక పంచాయితీలు తేలాల్సిన పరిస్థితి వస్తుంది.
