Krish: క్రిష్ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్ టైటిల్ పెడుతున్నారా?
- August 3, 2026 / 06:47 PM ISTByFilmy Focus Desk
ప్రముఖ దర్శకుడు క్రిష్ నుండి సరైన హిట్ సినిమా వచ్చి.. సుమారు 9 ఏళ్లు అవుతోంది. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో కొన్ని విజయాలు వచ్చినా అవి ఆయన స్థాయి విజయాలు కావు. బాగున్నాయని పేరు వచ్చినా.. అవి మనస్ఫూర్తిగా విజయాలు అని చెప్పుకోలేనివి. రీసెంట్గా అంటే గతేడాది వచ్చిన ‘ఘాటి’ సినిమా కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయింది. దీంతో క్రిష్ మరోసారి తన ఆలోచనల్ని మధించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో అంతా కొత్తవారితో ఓ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు.
Krish
తెలుగు సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన అభిరుచి, పంథాతో సాగుతున్న క్రిష్.. ఇప్పుడు మరోసారి తన పేరుకు తగ్గ కథను రెడీ చేసుకున్నారట. ఒకవైపు తన కాన్సెప్ట్, మరోవైపు నేటి తరానికి నప్పే కథను ఎంపిక చేసుకున్నారట. అదే జెన్జీకి నచ్చేలా, జెన్జీ యువతతో సినిమా చేయబోతున్నారు. ఈ మధ్య చాలా రకాల కథలు, కాన్సెప్ట్లు చేస్తున్నారంటూ వార్తలొచ్చినా.. ఈ ‘కొత్త’ ప్రయత్నం వైపే మొగ్గుచూపారట. త్వరలో సినిమాను అధికారికంగా ప్రకటించేస్తారట.
కొత్త వాళ్లతో క్రిష్ చేస్తున్న సినిమా ఈశాన్య భారతం నేపథ్యంలో నడిచే కథ అని తెలుస్తోంది. షూటింగ్ కూడా అక్కడే చేస్తున్నారని తెలుస్తోంది. అంతే కాదు ఈ సినిమా డబ్బింగ్ కూడా స్టార్ట్ అయిందట. నిజానికి రెండు, మూడు నెలల క్రితం ఈ సినిమా సమాచారం లీక్ వచ్చింది. ఇప్పుడు పోస్ట్ప్రొడక్షన్ అంటున్నారు అంటే.. సైలంట్గా షూటింగ్ పూర్తి చేసేశారన్నమాట. అంతేకాదు సినిమాకు ‘జెంజ్ బ్యాచ్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారట. సినిమా కథకు అనుగుణంగా ఈ టైటిల్ పెట్టారట.
నిజానికి క్రిష్ ఏమంత ఖాళీగా లేరు. సినిమాలు లేకపోయినా ఓటీటీల కోసం వరుస సిరీస్లు చేస్తూ వచ్చారు. అలాగే యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో ‘కన్యాశుల్కం’ అనే నాటకాన్ని వెబ్సిరీస్గా చేస్తున్నారు అనే వార్తలొచ్చాయి. దాని కోసమే ఆమె జబర్దస్త్ కూడా వదిలేసింది అని చెప్పారు. కానీ ఏమైందో ఏమో ఆ ప్రాజెక్ట్ గురించి గత కొన్ని నెలలుగా ఎలాంటి సమాచారం లేదు.














