నాని – సుజీత్ కాంబినేషన్లో ఓ సినిమా ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ‘ఓజీ’ సినిమా ఇచ్చిన బ్లాక్బస్టర్ విజయంతో మంచి ఊపు మీదున్న సుజీత్.. ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా కొత్త సినిమా ప్రారంభించేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఓ పెద్ద మార్పు వచ్చింది. గతంలో ఈ సినిమా అనౌన్స్మెంట్ విషయం గుర్తుంటే.. మేం చెప్పే విషయం సులభంగా అర్థమైపోతుంది. అదే నిర్మాణ సంస్థ మార్పు. అవును ఇప్పుడు ఈ సినిమాకు డబ్బులు పెడుతున్న నిర్మాణ సంస్థ కాకుండా వేరే నిర్మాత ఉండేవారు.
‘ఓజీ’ సినిమా పనులు ఫుల్ స్వింగ్లో నడుస్తున్న సమయంలోనే సుజీత్ దర్శకుడిగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ మరో సినిమా అనౌన్స్ చేసింది. అప్పటికే తమ బ్యానర్లో ‘సరిపోదా శనివారం’ చేస్తున్న నానితో ఆ సినిమా ఉంటుందని ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఈ సినిమా గురించి పెద్దగా ఎక్కడా ప్రస్తావన లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఇంక లేనట్లే అనుకున్నారంతా. అయితే ‘ఓజీ’ సినిమా ప్రచారంలో భాగంగా సుజీత్ మాట్లాడుతూ ఈ సినిమా ఉందని చెప్పారు. ఇప్పుడు మొదలైంది కూడా.
అయితే, ఇప్పుడు చూస్తే బ్యానర్ మారింది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమా రూపొందనుంది. ఈ బ్యానర్లో ఇప్పటికే నాని ఓ సినిమా చేశారు. అదే ‘శ్యామ్ సింగ రాయ్’. నిజానికి ఆ సినిమా కూడా వేరే బ్యానర్ నుండి వెంకట్ బోయనపల్లి దగ్గరకు వచ్చింది. దీంతో నాని సినిమాలకే ఎందుకు ఇలా జరుగుతోంది అనే చర్చ మొదలైంది. నాని లాంటి మినిమమ్ గ్యారెంటీ హీరో, ఒక్కోసారి బ్లాక్బస్టర్ హిట్ అందించే హీరో సినిమాకు ఇలా నిర్మాతలు మారడం ఏంటి? అనేదే ఇక్కడ చర్చ.
‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాను తొలుత సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత వివిధ పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్ట్ ఆపేద్దాం అనుకున్నప్పుడు.. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ ఆ ప్రాజెక్ట్ బాధ్యతలను ఎత్తుకుంది. ఇప్పుడు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నుండి ‘బ్లడీ రోమియో’ (వర్కింగ్ టైటిల్) వచ్చేసింది.