‘ఓజీ’ సినిమా గురించి ఇప్పటివరకు చాలా రకాల పుకార్లు వచ్చాయి. సినిమా విడుదల ముందు రోజు వరకు పవన్ను, ఆ సినిమాను టార్గెట్ చేస్తూ చాలా రకాల వార్తలు రాశారు. విపరీతమైన నెగిటివ్ కామెంట్లు కూడా వచ్చాయి. దర్శకుడు సుజీత్ గురించి కూడా ఏవేవో మాట్లాడారు గిట్టనివాళ్లు. అప్పుడెప్పుడూ స్పందించని దర్శకుడు సుజీత్.. తొలిసారిగా సినిమా గురించి రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఓ నోట్ను ఎక్స్లో పోస్ట్ చేశారు. దీంతో సుజీత్ ఇప్పుడెందుకు రియాక్ట్ అయ్యారు అనేదే ప్రశ్న. మరోవైపు ‘ఓజీ 2’ ఉంటుందా? ఉంటే నిర్మాత ఎవరవుతారు? అనే అనుబంధ ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
‘ఓజీ’ సినిమా నెట్ఫ్లిక్స్లో ఈ నెల 23 నుండి స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. దీని గురించి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో ఎక్కువసార్లు చూడలేకపోయాం అనుకున్నవాళ్లు.. థియేటర్లలో చూడని వాళ్లు ఆ మజాను ఓటీటీలో ఆస్వాదించే ఆలోచనలో ఉన్నారు. ఈ సమయంలో దర్శకుడు సుజీత్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పుకార్లు నమ్మొద్దని.. తనకు, నిర్మాతకు మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
‘ఓజీ’ సినిమా చిత్రీకరణ దశలో ఉన్నప్పుడే నాని హీరోగా సుజీత్ ఓ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్యేనే ఆ సినిమా నిర్మిస్తారని అప్పుడు చెప్పారు. దీంతో ‘సరిపోదా శనివారం’ కాంబో రిపీట్ అని అనుకున్నారంతా. కానీ ఇటీవల నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నాని – సుజీత్ సినిమా మొదలైంది. దీంతో దానయ్య, సుజీత్ మధ్య ఇబ్బంది తలెత్తింది అనే లీకులు వచ్చాయి. అయితే అది ‘ఓజీ’ సినిమా రెమ్యూనరేషన్ దగ్గర వచ్చిన లొల్లి అని ఆ పుకార్లకు మసాలా కలిపారు కొందరు.
కానీ సుజీత్ ఇప్పుడు అదేమీ లేదని.. తమ మధ్య ఎలాంటి ఇబ్బందులు, గొడవలు లేవని చెప్పకనే చెప్పారు. అయితే పుకార్లు, నోట్లో ఏది నిజమనేది తేలాలంటే ‘ఓజీ 2’ సినిమా స్టార్ట్ అవ్వాలి. లేదంటే అనౌన్స్మెంట్ రావాలి. చూద్దాం ఏమవుతుందో?