కొన్ని సినిమాలు థియేటర్లోనే చూడాలి.. ఆ ఫీల్ను ఎంజాయ్ చేయాలి అని అంటుంటారు. అలాంటివాటిలో ‘యుగానికొక్కడు’ ఒకటి. కార్తి, సెల్వ రాఘవన్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా అది. కార్తి కెరీర్లో అభిమాలనుకు ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. అలాంటి సినిమాకు సీక్వెల్ రావాలి అని చాలా ఏళ్లు అభిమానులు డిమాండ్ చేశారు. వారి కోరిక నెరవేరి కొన్నేళ్ల క్రితం సెల్వరాఘవన్ అండ్ టీమ్ అనౌన్స్ చేసింది. అయితే ఇప్పుడు ఆ అనౌన్స్మెంట్ చేయడమే తప్పు అంటున్నారు ఆయన.
‘యుగానికొక్కడు’ సినిమా తమిళంలో ఆశించిన విజయం అందుకోలేకపోయింది. తెలుగులో మాత్రం మంచి ఆదరణ సంపాదించుకుంది. అయితే రీరిలీజ్లో తమిళంలో కూడా భారీ వసూళ్లు అందుకుంది. కరోనా – లాక్డౌన్ పరిస్థితుల తర్వాత సినిమానుతమిళంలో విడుదల చేస్తే థియేటర్ల దగ్గర హౌస్ఫుల్ బోర్డులు రోజూ కనిపించాయి. అయితే రిలీజ్ చేసినప్పుడు కాకుండా రీ రిలీజ్కి స్పందన రావడం పట్ల దర్శకుడు సెల్వ రాఘవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రిలీజ్ సమయంలో వదిలేసి.. రీ రిలీజ్ చేస్తే చప్పట్లు కొడితే ఉపయోగం ఏంటని ప్రశ్నించారు.

తొలిసారి సినిమా విడుదలైనప్పుడు చాలా నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. రివ్యూలు చూస్తే చాలా బాధేసింది కూడా. జీవితంలో నెగెటివిటీని ఎలా ఎదుర్కోవాలో ఈ సినిమా నాకు నేర్పింది. ‘యుగానికొక్కడు’ సినిమా ఇప్పుడు చూసి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు, ఎంతో డబ్బు, సమయం పెట్టి ఈ సినిమా చేశాం. తొలిసారి విడుదలైనప్పుడు సంబరాలు చేసుకుని ఉంటే ఆనందపడేవాడిని. ఇప్పుడేం సంతోషంగా లేను అని అన్నారు. ఇదంతా ఓకే కానీ సీక్వెల్ ఎప్పుడు అని అడిగితే.. మరొక ఆసక్తికర సమాధానం వచ్చింది.

అసలు నేను ‘యుగానికొక్కడు 2’ అనౌన్స్మెంట్ చేయకుండా ఉండాల్సింది. కార్తి లేకుండా సినిమా సాధ్యం కాదు. సినిమాకు భారీ బడ్జెట్ అవసరం. అలాగే హీరో కనీసం ఏడాది పాటు కాల్షీట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా పూర్తి చేయడం సాధ్యం కాదు. అదే సమయంలో బడ్జెట్ కూడా ఇప్పుడు పెట్టలేం అని చెప్పారు. అంటే ఇక మనం ‘యుగానికొక్కడు 2’ చూసే అవకాశమే లేదు.
