తెలుగులో జాంబీల మీద సినిమానా? ఐదేళ్ల క్రితం ‘జాంబీ రెడ్డి’ సినిమా అనౌన్స్ అయినప్పుడు ఇలానే అనుకున్నారు. ఎందుకంటే మనకు జాంబీ సినిమాలు అంటే హాలీవుడ్ సినిమాలే. ఓసారి ఎప్పుడు బాలీవుడ్లో ఓ సినిమా చేసినట్లున్నారు. అయితే ఆ సినిమా దర్శకుడి మీద చిన్న నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే దర్శకుడు ప్రశాంత్ వర్మ అప్పటికే ‘ఆ!’ అనే వైవిధ్యమైన సినిమా తీసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఈ సినిమా వచ్చాక మన నేటివిటీకి సంబంధించని కథను ఎలా తీయాలో చేసి చూపించారు అని మెచ్చుకోలు పొందారు.
Zombie Reddy 2
ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఆయన ఆ సినిమాకు సీక్వెల్ కథ రెడీ చేసి మొన్నీమధ్య అనౌన్స్ చేశారు. ఆ సినిమా గురించి హీరో తేజ సజ్జా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘పుష్ప 2’ తరహా డైలాగ్ ఒకటి వేశారు. దీంతో మరోసారి అందరూ దీని గురించి మాట్లాడుతున్నారు. తొలి ‘జాంబీ రెడ్డి’ రాయలసీమ నేపథ్యంలో సెటైరికల్ టచ్తో తెరకెక్కగా.. రెండో సారి జాంబీల సంగతి ఇంటర్నేషనల్ లెవల్లో చూపించబోతున్నారట.
తేజ సజ్జా – ప్రశాంత్ వర్మ – పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్లో రూపొందనున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తారని కచ్చితంగా చెప్పొచ్చు. అందుకు తగ్గట్టే సెకండ్ పార్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండేలా చూసుకుంటున్నారట. సరదా తగ్గకుండా.. విదేశీ జాంబీ సినిమాల లెవల్లో ఈ సినిమా ఉంటుంది అని తేజ చెప్పాడు. ఇప్పటివరకు మనం విదేశీ జాంబీ సినిమాలు చూశామని, ఇకపై మనమే ప్రపంచానికి ఒక తెలుగు జాంబీ సినిమా ఇస్తున్నాం అని తేజ చెప్పాడు.
అలాగే ‘జాంబీ రెడ్డి’ గురించి కూడా తేజ కొన్ని విషయాలు మాట్లాడాడు. తొలి సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదని, మంచి ఫలితమే వచ్చినా ఇంకాస్త బాగా ఆడాల్సిందని చెప్పాడు. అప్పటికి అందరం (సినిమా టీమ్) కొత్త వాళ్లం కాబట్టి అది ఓకే. ఇప్పుడు సినిమా స్థాయి, మా స్థాయి పెరిగింది. కాబట్టి ఈసారి ఇంకాస్త మంచి ఫలితం ఆశిస్తున్నాం అని చెప్పాడు తేజ.