సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ద్వేషం చిమ్ముతున్న వారి మీద పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, సెలబ్రిటీలే లక్ష్యంగా నెటిజన్లు తప్పుడు ప్రచారాలు, అభ్యంతరకర కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ కథానాయకుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడిని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు.
గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. గత కొద్ది రోజులుగా మార్క్ శంకర్పై, పవన్ కల్యాణ్ కుటుంబం గురించి అనుచిత పోస్టుల చేస్తున్న వ్యక్తిని గుర్తించి అరెస్టు చేశామని తెలిపారు. కర్నూలు జిల్లా తాడిపత్రి మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన రఘు అలియాస్ పుష్పరాజ్ ఆ పని చేశాడని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) , మరో అగ్ర హీరో ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న సోషల్ మీడియా పోరులో భాగంగా పుష్పరాజ్ ఈ పోస్టులు చేశాడని ఎస్పీ తెలిపారు.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తిలక్ నగర్కు చెందిన సాంబశివరావు అనే వ్యక్తి తొలుత రఘు సోషల్ మీడియా వ్యాఖ్యల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై గుంటూరు జిల్లా పోలీసులు విచారణ చేపట్టగా, దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ పోస్టులు చేసిన రఘు 5 మొబైల్ ఫోన్లు వాడుతున్నాడని, 14 మెయిల్ ఐడీలను ఉపయోగించి ఎక్స్లో పలు ఖాతాలు తెరిచి ఇలాంటి పోస్టులు పెడుతున్నాడని తెలిపారు.
రఘు పోస్టులను పరిశీలించిన అధికారులు.. వాటిలో మహిళలపై చేసిన వ్యాఖ్యలే ఎక్కువగా ఉన్నాయని తేల్చారు. రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టి ఇబ్బంది పెట్టేలా కూడా కొన్ని పోస్టులు ఉన్నాయని తెలిపారు. రఘుపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని.. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని ఉపేక్షించేది లేదని చెప్పారు.