‘మిరాయ్’ గట్టిగా సౌండ్ చేసుకుంటూనే అనౌన్స్ అయింది. కాస్టింగ్, క్రూ చెబుతున్నప్పుడు కూడా అదే రేంజి సౌండ్ వచ్చింది. అంతే సౌండ్తో సినిమా షూటింగ్ జరుపుకుంది. అయితే ఏమైందో ఏమో మధ్యలో కాస్త డల్ అయింది. తిరిగి సినిమా ట్రైలర్ వచ్చాక ఆ సౌండ్, రీసౌండ్ కలిపి బ్లాక్బస్టర్ హైప్తో ఈ నెల 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా దర్శకుడు కమ్ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని సినిమా గురించి ఇటీవల కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
అశోక చక్రవర్తి దగ్గర 9 దైవ గ్రంథాలు ఉండేవనే ఓ కల్పిత పురాణం ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నాం అని టీమ్ చాలా రోజుల క్రితమే చెప్పింది. మానవాళికి ఎలాంటి సమస్య ఎదురైనా ఆ గ్రంథాలతో పరిష్కారం లభిస్తుందనేది సినిమాలో మెయిన్ పాయింట్. దుష్ట ఆలోచనలున్న మనిషి చేతిలోకి ఆ జ్ఞాన గ్రంథాలు వెళ్లిపోతే ఏం జరుగుతుంది అనేది కథ అని దర్శకుడు కార్తిక్చెప్పారు.
ఆరేళ్ల క్రితం తనకీ ఆలోచన వచ్చిందని, స్క్రిప్ట్ రాయడానికి చాలా సమయం పట్టిందని తెలిపారు. మూడేళ్ల కిందట చిత్రీకరణ మొదలైందని, జాగ్రత్తగా, విజువల్ వండర్గగా ఉండేలా చూసుకున్నామని చెప్పారు. మంచు పర్వతాలు, ఎడారులు, అడవుల్లో షూటింగ్ చేశామని చెప్పిన ఆయన.. 70 రోజులపాటు సెట్లో కార్వ్యాన్ లేకుండా చిత్రీకరణ చేశామని గుర్తు చేసుకున్నారు. యానిమేట్రిక్స్ ఉపయోగించి తీసిన సీన్స్ అబ్బురపరిచేలా ఉంటాయని చెప్పారు.
సినిమాలోని సూపర్ యోధ భవిష్యత్తులో మళ్లీ తిరిగొస్తాడా అని కొందరు అడడుగుతున్నారని చెప్పిన కార్తిక్.. కచ్చితంగా తిరిగొచ్చే అవకాశం ఉందంటూ సీక్వెల్ ఆలోచనను బయట పెట్టారు. భవిష్యత్తులోనూ సూపర్యోధ నేపథ్యంలో సినిమాలు వస్తాయని తేల్చారు. అయితే ఇవన్నీ జరగాలంటే ఈ సినిమా ఇప్పుడున్న హైప్కి తగ్గట్టు ఉండాలి. మరి కార్తిక్ ఎలా తీశారు, జనాల్ని దీనిని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఇక్కడ ఆసక్తికరం. తేజ సజ్జా, మంచు మనోజ్, రితిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.