Akith Balyan: ఆ సింగర్ని మేమే చంపాం.. గ్యాంగ్ షాకింగ్ కామెంట్స్
- August 29, 2026 / 02:20 PM ISTByFilmy Focus Desk
ప్రముఖ హరియాణా నటుడు, గాయకుడు అంకిత్ బాలన్ ఇటీవల దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పాటలు, డిజిటల్ వీడియోలతో యూట్యూబ్లో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన బుధవారం మృతి చెందడంతో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉత్తర్ప్రదేశ్లోని షామ్లీ జిల్లాలో ఓ జిమ్ బయట అంకిత్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. 18 రౌండ్ల కాల్పులు జరపడంతో అంకిత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Akith Balyan
అయితే ఈ హత్య తమ పనేనంటూ జితేందర్ మన్ గోగి గ్యాంగ్ సోషల్ మీడియాలో ప్రకటించింది. దీంతో ఈ విషయం పెద్ద చర్చనీయాశంగా మారింది. ఇటు సినిమా పరిశ్రమలో, అటువైపు పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు అందరి చర్చ ఈ విషయం గురించే. ‘భోలూ సహాపురియా’ అనే పేరుతో ఉన్న సోషల్ మీడియాల ఖాతాలో ఈ పోస్ట్ కనిపించింది. దీనికి కారణమేంటా అని చూస్తే.. ఐదేళ్ల క్రితం జరిగిన ఓ హత్య.. దాని నేపథ్యంలో అంకిత్ సుమారు మూడేళ్ల క్రితం రూపొందిన ఓ పాట అని తెలుస్తోంది.
2021లో ఢిల్లీలోని రోహిణి కోర్టు గదిలో గ్యాంగ్స్టర్ జితేందర్ గోగిని ప్రత్యర్థులు కాల్చి చంపారు. ఆ విషయాన్ని ఉద్దేశిస్తూ అంకిత్ 2024లో ‘కోర్ట్ మే గోలీ…’ అనే పాట రూపొందించారు. తమ శత్రువులకు మద్దతుగా ఆ పాట రాశాడని గోగి ముఠా ఆరోపించింది. తమ గ్యాంగ్కు వ్యతిరేకంగా పనిచేసే ప్రతీ ఒక్కరికీ ఇదే పరిస్థితి ఏర్పడుతుంది అని ఆ పోస్టులో ఉంది. ఈ హత్య వెనుక పాటల వివాదంతో పాటు రాజకీయ వైరం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
త్వరలో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంకిత్ సిద్ధమైనట్లు సమాచారం. దీంతో ఇందులో రాజకీయ కోణం కూడా బయటకు వచ్చింది. ఇప్పటికే ప్రధాన పార్టీల నాయకుల మధ్య విమర్శ ప్రతివిమర్శలు జరుగుతున్నాయి..















