‘బాహుబలి’ సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. రాజమౌళి తన పరపతిని ప్రపంచవ్యాప్తం చేసుకున్నారు. తెలుగు సినిమా అభిమానులు టాలీవుడ్ జిందాబాద్ అంటూ గొప్పగా మాట్లాడుకున్నారు. కానీ ఓ ఇద్దరు మాత్రం తమ ఆనందం ఎంతలా పెరిగిందో చెప్పలేదు. వాళ్లే నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని. ఆనందం చెప్పడకపోవడమేంటి అని అనుకుంటున్నారా? వాళ్ల రియాక్షన్ తెలియాలంటే ఇంకో సినిమా నిర్మించి తమ బ్యానర్ స్థాయి ఏంటి అనేది చూపించాలి.
అప్పట్లో సినిమా నిర్మాణ సంస్థ వెల్లడించిన లెక్కల ప్రకారం రెండు ‘బాహుబలి’ సినిమాలు కలిపి సుమారు రూ.2000 కోట్లు లాభం పొందాయి. అందులో ఎంత నిర్మాతలకు వచ్చింది అనేది పక్కన పెడితే బయటకు వచ్చిన లెక్కల ప్రకారం రూ.450 కోట్లు పెట్టి రూ.2500 కోట్ల వరకు సాధించారు. ఇంత వసూళ్లు సాధించి, లాభాలు సాధించిన నిర్మాణ సంస్థ ఆ తర్వాత యాక్టివ్గా లేదు. ఓ రెండు సినిమాలు చేసినా అవి స్ట్రెయిట్ ప్రొడక్షన్ కావు. వేరే నిర్మాణ సంస్థలతో కలసి చేశాయి. ఈ కోవలో మరో రెండు సినిమాలు కూడా అనౌన్స్ చేసింది.
అవే ‘ఆక్సిజన్’, ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’. ఫహాద్ ఫాజిల్ హీరోగా ఈ రెండు సినిమాలు తెరకెక్కుతాయని కూడా తెలిపింది. అందులో రెండో సినిమాను ఇప్పుడు స్టార్ట్ చేశారు. శశాంక్ యేలేటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శశాంక్ ఇంతకుముందు ‘మన ముగ్గురి లవ్ స్టోరీ’ అనే టీవీ సిరీస్ చేశారు. ఫహాద్ను ఒప్పించి తెలుగులో హీరోగా నటింపజేస్తున్నారంటే కథలో, కథకుడిలో ఏదో కొత్తదనం ఉంటుంది అని చెప్పేయొచ్చు. లేకపోతే ఫహాద్ చేయడుగా. ఈ సినిమాకు రాజమౌళి సమర్పకుడు కాగా.. కార్తికేయ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. వ్యవహరిస్తుండడం విశేషం.
ఇదంతా ఓకే కానీ.. అంత వసూళ్లు సాధించి, అంత పెద్ద పేరు తెచ్చుకుని అగ్ర హీరోలకు వరుసగా అడ్వాన్స్లు ఇచ్చి సినిమాలు చేయాల్సిన ఆర్కా మీడియా ఎందుకు అలా చేయడం లేదబ్బా!