71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వివరాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ విభాగాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఈ నేపథ్యంలో పురస్కారాల గురించి ఎవరేమన్నారో చూద్దాం!
‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికవడం గర్వకారణం. నిర్మాతలు సాహు గారపాటి, హరీశ్ పెద్ది, దర్శకుడు అనిల్ రావిపూడి, ఇతర నటులు, సాంకేతిక నిపుణులు ఇలా అందరి కృషి వల్లే ఈ సినిమా విజయం సాధ్యమైంది. ఇప్పుడు పురస్కారం కూడా దక్కించుకుంది. ఇతర విజేతలకూ అభినందనలు. వారి ప్రతిభ భారతీయ సినీ రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఈ గుర్తింపు మాకు మరింత స్ఫూర్తినిస్తూ, ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల హృదయాలను తాకే శక్తిమంతమైన కథలను అందించాలన్న మా తపనను రెట్టింపు చేస్తుంది’’ అని బాలకృష్ణ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
‘‘హను-మాన్’ యానిమేషన్ – వీఎఫ్ఎక్స్, యాక్షన్ కొరియోగ్రఫీ అవార్డులు దక్కించుకోవడం ఆనందంగా ఉంది. వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ వెంకట్ కుమార్, స్టంట్ మాస్టర్స్ నందు, పృథ్వీకి శుభాకాంక్షలు’’ అని దర్శకుడు ప్రశాంత్ వర్మ రియాక్ట్ అయ్యారు. ‘‘బెస్ట్ స్క్రీన్ప్లే, బెస్ట్ మేల్ సింగర్ విభాగాల్లో ‘బేబీ’ సినిమా అవార్డులు దక్కించుకోవడం ఆనందంగా ఉంది. ఇది నా కెరీర్కు కీలకం. స్క్రీన్ప్లేకు పురస్కారం దక్కడం మామూలు విషయం కాదు. నిర్మాత ఎస్కేఎన్ నన్ను నమ్మకపోతే ఈ సినిమా సాధ్యమై ఉండేది కాదు’’ అని దర్శకుడు సాయి రాజేశ్ చెప్పుకొచ్చారు.
‘నా కెరీర్లో చేసిన విభిన్న ప్రయత్నం ‘భగవంత్ కేసరి’ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. ఈ పురస్కారం బోనస్ అని అనుకుంటున్నా. మా ప్రయత్నానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. కమర్షియల్ ఎలిమెంట్తోనే ‘బనావో బేటీకో షేర్’ కాన్సెప్ట్ని చెప్పగలిగాం. గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ లాంటి సున్నితమైన అంశాన్ని బాలకృష్ణ లాంటి స్టార్ హీరో నోట ప్రస్తావించగలిగాం. సినిమాకు విజయంతోపాటు ఇలాంటి గుర్తింపు దక్కితే క్రియేటర్స్కు కిక్ వస్తుంది. మరిన్ని మంచి సినిమాలను తెరకెక్కించేందుకు ఈ పురస్కారం స్ఫూర్తినిస్తుంది’’ అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు.
‘‘తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ పల్లె స్వచ్ఛతను చాటిపెట్టిన ఈ పాటకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందరో గొప్ప రచయితల తర్వాత ఈ పురస్కారం టాలీవుడ్ నుండి నాకు దక్కింది. ఈ అవకాశం నాకు రావడానికి కారణమైన సినిమా టీమ్ అందరికీ ధన్యవాదాలు’’ అని ‘బలగం’ సినిమాలోని ‘ఊరు పల్లెటూరు’ గీత రచయిత కాసర్ల శ్యామ్ చెప్పారు.