Dil Raju: ‘ఫ్యామిలీ స్టార్‌’పై నెగిటివ్‌ ప్రచారం… సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు!

సినిమా విడుదలవ్వాలి, ఆ తర్వాత దానికి రివ్యూలు రావాలి, అవి చదివాక ఆ సినిమా చూడాలా వద్దా అనేది ప్రేక్షకులు నిర్ణయించుకోవాలి. ఇదంతా ఒక ప్రాసెస్‌. గతకొన్నేళ్లుగా ఇదే జరుగుతోంది, భవిష్యత్తులో కూడా ఇదే జరుగుతుంది. అయితే ఈ ప్రాసెస్‌ ఆర్డర్‌లో మార్పులు జరిగితే సినిమాకు, నిర్మాతకు తద్వారా చిత్రపరిశ్రమకు నష్టం. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఈ ప్రాసెస్‌లో ఆర్డర్‌ మారి సినిమా రిలీజ్‌కు ముందే రివ్యూలు రాసేశారు కొంతమంది నెటిజన్లు.

దీంతో ఆ విషయం ఇప్పుడు సైబర్‌ క్రైమ్‌ వరకు వెళ్లింది. విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడిగా పరశురామ్‌ (Parasuram)  రూపొందించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్‌’ (The Family Star) మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) కథానాయికగా నటించిన ఈ సినిమా ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిల్‌ రాజు (Dil Raju) నిర్మించిన ఈ చిత్రానికి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా విడుదల కాకుండానే కొంతమంది సోషల్‌ మీడియాలో నెగిటివ్‌ వ్యాఖ్యలు, పోస్టులు చేశారట. ఈ మేరకు దుష్ప్రచారం చేస్తున్న వారిపై విజయ్‌ దేవరకొండ టీమ్‌ మాదాపూర్ పీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ వింగ్‌లో ఫిర్యాదు చేసింది.

ఉద్దేశపూర్వకంగా సోషల్‌ మీడియాలో నెగిటివ్‌ కామెంట్స్‌ చేస్తున్నారని విజయ్‌ టీమ్‌ ఫిర్యాదులో పేర్కొంది. ఆ పోస్టుల ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరింది. పోస్టులకు స్క్రీన్‌ షాట్లను చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పోలీసులకు ఇచ్చింది. దీంతో ఈ విషయంలో ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. సినిమా మీద అంత కసి ఎవరికి ఉంది అంటూ చర్చ మొదలైంది. మరి ఈ విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

నిజానికి నిర్మాత దిల్‌రాజు ఇదివరకే ఈ విషయంలో ఆవేదన వ్యక్తం చేశారు. నెగెటివ్‌ ప్రచారం ఇండస్ట్రీకి మంచిది కాదని, సినిమా విజయం సాధించాలంటే అందరూ ఆమోదించాల్సిందే కానీ, మంచి సినిమాకు ప్రేక్షకులు రాకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. ఇప్పుడు విజయ్‌ టీమ్‌ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus