పవన్ కల్యాణ్ సినిమా ‘ఓజీ’ మేనియా గురించి ఎంత చెప్పినా తక్కువే అనేలా ఉంది పరిస్థితి. నిన్న జోరు వానలో కూడా ఫ్యాన్స్ అంతా వచ్చి ఓజీ కాన్సర్ట్ను హిట్ చేశారు. పవన్ కల్యాణ్ అండ్ కో. మొత్తం వచ్చి సినిమా గురించి గొప్పగా చెప్పారు. అంచనాలను మరింత పెంచారు. అయితే అంతకుమందే మధ్యాహ్నం ఈ సినిమా హైప్ను తెలిపే ఓ పని జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఫస్ట్ టికెట్ను పవన్ అభిమానులు రూ.లక్షకు పైగా వేలంలో పాడి కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీనివాసా థియేటర్లో ‘ఓజీ’ సినిమా బెనిఫిట్ షో ఫస్ట్ టికెట్కు ఫ్యాన్స్ వేలం నిర్వహించారు. ఇందులో పవన్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో సందడిగా పాల్గొన్నారు. పోటీ పడి మరీ టికెట్ దక్కించుకునేందుకు యత్నించారు. లక్కారం గ్రామానికి చెందిన ఆముదాల రమేష్ రూ.1,29,999 పెట్టి టికెట్ సొంతం చేసుకున్నాడు. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వనున్నట్లు అభిమానులు తెలిపారు.
శనివారం నాడు కూడా ఇలాంటి ఓ ఘటన జరిగింది. చిత్తూరు నియోజకవర్గంలో ‘ఓజీ’ మూవీ ఫస్ట్ టికెట్ను ఓ అభిమాని రూ.లక్షకు సొంతం చేసుకున్నాడు. ఈ డబ్బును గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడేలా జనసేన పార్టీ ఆఫీస్కు పంపిస్తామని థియేటర్ యాజమాన్యం తెలిపింది. ఈ సినిమాను సెప్టెంబరు 25న విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో 25న అర్ధరాత్రి ప్రీమియర్ షో వేస్తామని తొలుత ప్రభుత్వం నుండి టీమ్ అనుమతి తెచ్చుకుంది. అయితే ఇప్పుడు తెలంగాణ తరహాలో 24న రాత్రి 9 గంటలకు షో వేస్తారని సమాచారం. త్వరలోనే దీనిపై జీవో విడుదలవుతుంది అని సమాచారం.