‘మహానటి’ సినిమాలో దిగ్గజ నటుడు జెమినీ గణేశన్గా నటించి మెప్పించాడు ప్రముఖ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్. ఇప్పుడు మరో దిగ్గజ నటుడు ఎం.కె.త్యాగరాజన్ అలియాస్ ఎంకేటీగా నటించాడా? టాలీవుడ్, కోలీవుడ్ పుకార్లు అయితే అదే మాట చెబుతున్నాయి. అయితే ఆయనే అని చెప్పకుండా ఆ పాత్రను స్ఫూర్తిగా తీసుకొని రూపొందించిన పాత్ర అని చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో విడుదల కానున్న ‘కాంత’ సినిమాలోనే ఇది జరుగుతోందట.
ఈ నెల 14న విడుదల కానున్న ‘కాంత’ సినిమా విడుదలయ్యాక అభిమానులంతా దుల్కర్ సల్మాన్ను నటచక్రవర్తి అని పిలుస్తారని ఈ మధ్య రానా ఓ రేంజి ఎలివేషన్ ఇచ్చాడు. హైదరాబాద్లో స్టూడియోలు లేని సమయంలో హైదరాబాద్ వచ్చామని, అప్పట్లో అన్నపూర్ణ, రామా నాయుడు, పద్మాలయ స్టూడియోల నిర్మాణం అవుతున్నప్పుడు ఎక్కువగా గాసిప్స్ వచ్చేవని నాటి రోజుల గురించి చెప్పాడు రానా. అప్పుడు స్టూడియోల్లో ఏం జరుగుతుందనేది అప్పట్లో చాలామంది తక్కువ మందికే తెలిసేది. ఆ నేపథ్యంలో రాసుకున్న కథే ‘కాంత’ అని అన్నాడు.

అయితే ‘మహానటి’ తరహాలోనే ‘కాంత’ కూడా బయోపిక్కే అని చెబుతున్నారు. తెలుగు వాళ్లకు పెద్దగా తెలియని ఒక లెజెండరీ తమిళ నటుడి కథతో ఈ సినిమా కథను రూపొందించారట దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్. తెలుగులో ఎన్టీఆర్ కంటే ముందు చిత్తూరు నాగయ్యను పెద్ద స్టార్ అనేవారు. అయితే ఎక్కువ కాలం ఆయన అలా ఉండలేదు. అలానే తమిళంలో ఎం.కె. త్యాగరాజన్ తొలి తరం స్టార్ హీరో. ఆయన్ను అభిమానులు ఎంకేటీ అని పిలుచుకునేవారు. ఆయన కథ స్ఫూర్తే ‘కాంత’ అని టాక్.

1910లో పుట్టిన త్యాగరాజన్ది పేద కుటుంబం. స్టేజీ సింగర్గా పేరు సంపాదించింది ఎంకేటీగా మారి సినిమాల్లోకి వచ్చాడు. ఆయన సినిమా ‘హరిదాస్’ అప్పట్లో వంద వారాలకు పైగా ఆడిందని సమాచారం. దీంతోనే ఆయనకు స్టార్ హోదా వచ్చిందట. ఆ రోజుల్లోనే ఆయన మెర్సిడెస్ బెంజ్లో తిరగేవారట. బంగారు పళ్లెంలో భోజనం చేసేవాడట. అయితే 1944లో ఒక హత్య కేసులో చిక్కుకోవడంతో జీవితం తలకిందులు అయింది. రెండేళ్లు జైల్లో ఉన్న తర్వాత నిర్దోషిగా బయటికొచ్చారు. అయితే ఆ ఎఫెక్ట్కెరీర్ మీద పడింది. డబ్బులన్నీ కూడా పోగొట్టుకుని ఆరోగ్యం దెబ్బతిని 49 ఏళ్ల వయసులోనే 1959లో చనిపోయాడంటారు.
