పవన్ కల్యాణ్ గురించి ఇండస్ట్రీలో ఓ మాట చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఓ నిర్మాతకు మాటిస్తే.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆ సినిమా చేసిపెడతారు అని. గతంలో ఎంతోమందికి ఆయన అలా సినిమా చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. మొన్నీమధ్య సురేందర్ రెడ్డి సినిమా అప్డేట్ వచ్చాక పవన్ మాట ఇవ్వడం గురించి మరోసారి చర్చ జరుగుతోంది. రామ్ తాళ్లూరి నిర్మాణంల వక్కంతం వంశీ కథతో సురేందర్ రెడ్డి ఓ సినిమా చేస్తారు అని కొన్ని ఏళ్ల క్రితం అనౌన్స్ అయింది. ఎస్ఆర్టీ పతాకంపై ఈ సినిమా ఉంటుందేమో అనుకున్నారంతా.
అనూహ్యంగా కొత్త ఏడాది సందర్భంగా చిత్రబృందం ఓ కొత్త బ్యానర్ను అనౌన్స్ చేసింది. జైత్రరామ మూవీస్ అంటూ తమ కొత్త బ్యానర్ను రామ్ తాళ్లూరి లాంచ్ చేశారు. పవన్, సూరి, వంశీ కలిసిన ఫొటోను షేర్ చేస్తూ ఈ గుడ్ న్యూస్ రివీల్ చేశారు. త్వరలోనే సినిమా మొదలవ్వొచ్చు అనే హింట్ కూడా ఇచ్చారు. గత రెండు సినిమాలు ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’ సినిమాలు తెరకెక్కినట్లుగానే ఈ సినిమా కూడా పవన్ డేట్స్, టైమ్ సర్దుబాటుతో తెరకెక్కుతుంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అయితే, ఈ సినిమాను ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేలా ఉండబోతోంది అని సమాచారం. అంటే ఇటు సినిమా ప్రేక్షకుల్ని, అటు అభిమానుల్ని అలరించేలా ఉంటూనే.. తన రాజకీయ అవసరాలకు తగ్గట్టుగానూ ఉండేలా చూసుకుంటున్నారని టాక్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ, సామాజిక పరిస్థితుల మీదే ఈ సినిమా రూపొందిస్తారు అని చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగా ఓ సోషల్ సెటైర్ కథను వక్కంతం వంశీ రాశారట. మరి అందులో ఏ పాయింట్ని డిస్కస్ చేస్తారో చూడాలి.
ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రిలీజ్ చేసే ఉద్దేశంలో ఉన్నారట. దాని వల్ల ఎన్నికలకు ముందు తన గురించి, తన పార్టీ సిద్ధాంతాల గురించి మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లొచ్చు అని పవన్ అనుకుంటున్నట్టు సమాచారం.