‘హరి హర వీరమల్లు’.. ఈ సినిమా పేరు విన్నాక ఎవరైనా ఇది ఓ కామెడీ బేస్డ్ సినిమా అని అనుకుంటారా? కానీ ప్రముఖ దర్శకుడు క్రిష్ ఇలానే అనుకున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు జ్యోతి కృష్ణ చెప్పారు. ‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదలైన తర్వాత ఈ మధ్య మీడియాతో మాట్లాడిన జ్యోతి కృష్ణ సినిమా మీద, దర్శకుడు క్రిష్ మీద ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘వీరమల్లు’ సినిమాను తొలుత క్రిష్ వినోదాత్మకంగా తీయాలని అనుకున్నారు. ఆ మేరకు షూటింగ్ కూడా మొదలెట్టారు. కానీ తర్వాత మార్చారట.
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘హరి హర వీరమల్లు’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చి ఆశించిన ఫలితం అందుకోని విషయం తెలిసిందే. సినిమా వీఎఫ్ఎక్స్ సన్నివేశాల విషయంలో అభిమానులు, ప్రేక్షకులు అసంతృప్తిగా ఉన్నారు. కథ మారిపోయింది, కథనం మారిపోయింది. గతంలో క్రిష్ అనుకున్నది ఈ లైన్ కాదు లాంటి కామెంట్లు కూడా వినిపించాయి. ఈ మేరకు జ్యోతి కృష్ణ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ‘వీరమల్లు’ సినిమా జానర్ మార్చేసిన విషయం చెప్పారు.
తాను ‘వీరమల్లు’ సినిమా ప్రారంభం నుండి సినిమా టీమ్తోనే ఉన్నాను, కోహినూర్ ప్రధానాంశంగా సాగే ఈ కథను ఫన్ ఫిల్మ్గా రూపొందించాలని తొలుత భావించారు. ‘మాయా బజార్’ సినిమా స్టైల్లో తీయాలని క్రిష్ ఆలోచన చేశారు. అలాగే ప్రారంభించాం కూడా. ఓ యాక్షన్ సీక్వెన్స్ను తీశాక కొవిడ్ – లాక్డౌన్ వచ్చింది. ఆ తర్వాత మరో యాక్షన్ సీక్వెన్స్ తీశాక కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి. దీంతో సినిమా షూటింగ్కి వరుసగా బ్రేక్స్ వచ్చాయి అని జ్యోతి కృష్ణ చెప్పారు.
అన్నాళ్లూ వెయిట్ చేసిన క్రిష్ తాను గతంలో అంగీకరించిన ప్రాజెక్ట్లు ఉండడంతో ‘వీరమల్లు’ వైదొలిగారు. ఆ తర్వాత కథను రెండు పార్టులుగా తీస్తానని పవన్కు జ్యోతి కృష్ణ వివరించారట. ఆ తర్వాత మొదటి భాగం కథలో మార్పులు చేశారు. క్రిష్ అనుకున్న కోహినూర్ కథ పార్ట్ 2లో వస్తుందట. కోహినూర్ కోసం అసలేం జరిగిందనేది ఆ పార్టులో చూపిస్తారట. ఇక ఈ సినిమాలో 4,399 సీజీ షాట్స్ వాడాటర. వాటిల్లో 5 షాట్స్ బాగోలేవు. దీనికే కొంతమంది మొత్తం సినిమా బాగోలేదు అనేస్తున్నారు అని జ్యోతి కృష్ణ తెలిపారు. ఏదేమైనా ఇంత సీరియస్ కథని కామెడీ జోనర్లో తీయాలని ఎలా అనుకున్నారబ్బా.. అదే అర్థం కావడం లేదు.