Kareena Kapoor: బాలీవుడ్ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్.. ఇలా అనేసిందేంటి?
- September 11, 2026 / 08:21 PM ISTByFilmy Focus Desk
ఒక సినిమా విడుదలై భారీ విజయం సాధిస్తే.. ఆ తర్వాత ఇతర దర్శకులు అలాంటి కథలవైపు దృష్టి పెడతారు.. హీరోలు కూడా అలాంటి కథలే కావాలి అంటారు అని అంటుంటారు టాలీవుడ్లో. నిజానికి ఈ పరిస్థితి టాలీవుడ్లోనే కాదు మొత్తం ఇండియన్ సినిమాలో ఉంది. ఈ మాట నిజం కాదు అని ఎవరు చెప్పినా.. ఆ మాటను నమ్మలేని రీతిలో వారి తర్వాతి సినిమాలు ఉంటూ ఉంటాయి.
Kareena Kapoor
ఇంకా ఈ మాట విషయంలో డౌట్ ఉంటే.. రీసెంట్గా ఈ విషయంలో ప్రముఖ బాలీవుడ్ కథానాయిక కరీనా కపూర్ ఇచ్చిన స్టేట్మెంట్లు చూడండి మీకే అర్థమవుతుంది. బాలీవుడ్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అనేది ఆమె మాటల్లో అర్థమవుతోంది. హింసాత్మక కథతో తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధిస్తే… మిగతా దర్శక నిర్మాతలు హింసను సక్సెస్ ఫార్ములాగా భావిస్తారని కరీనా ఆందోళన వ్యక్తం చేసింది.
అక్కడితో ఆగకుండా ‘యానిమల్’ సినిమా హిట్ అయింది కాబట్టి, అందరూ అటువంటి సినిమాలే తీద్దామని అనుకుంటున్నారు. అది గొర్రెల మంద మనస్తత్వం. దర్శక నిర్మాతలు హిట్ ఫార్ములా వెంట పడటం మానేయాలి. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకొని సినిమాలు తీయాలి అని కరీనా అంది. దీంతో ఆమె ఇలా అనేసిందేంటి అనే చర్చ మొదలైంది.
అయితే, కొందరు ఈ వ్యాఖ్యలును సందీప్ రెడ్డి వంగాకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలుగా కూడా చూస్తున్నారు. ఎందుకంటే బాలీవుడ్ బృందం గత కొన్ని ఏళ్లుగా సందీప్ను టార్గెట్ చేశాయి. ఆయన సినిమాలను, ఆలోచనలను కించపరిచేలా మాట్లాడుతున్నాయి. అయితే కరీనా మాటలు చూస్తుంటే ఆమె బాలీవుడ్ ఆలోచన శైలిని విమర్శించేలా మాత్రమే అనిపిస్తున్నాయి.
నిజానికి బాలీవుడ్లోనే కాదు టాలీవుడ్లోనూ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత ఆ తరహా సినిమాలు మనవాళ్లూ చేశారు. ‘యానిమల్’ చూసి ఆ క్యారెక్టరైజేషన్తో మన దగ్గర కూడా సినిమాలు ట్రై చేశారు. ఇక పాన్ ఇండియా కోరిక అయితే చెప్పక్కర్లేదు. ఎన్ని దెబ్బలు తిన్నా పాన్ ఇండియా ముచ్చట ఆగడం లేదు మన టాలీవుడ్లో.
















