‘కుమారి 21 ఎఫ్’.. తెలుగు సినిమానే కాదు, తెలుగు కుర్రకారు ఆలోచనా విధానం మీద కూడా బాగా ఎఫెక్ట్ చూపించిన చిత్రం. అమ్మాయిల్ని అలా తప్పుగా జడ్జ్ చేయొద్దు అని చాలా స్ట్రాంగ్ మెసేజ్లా ఇచ్చారు ఆ సినిమాతో దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్. రాజ్ తరుణ్, హెబా పటేల్ జంటగా నటించిన ఆ సినిమాను ఇప్పుడు ఫ్రాంచైజీగా మార్చబోతున్నారట. అవును మీరు చదివింది నిజమే. ‘కుమారి’ సినిమా సిరీస్ నుండి వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నారట. అలా అని ఒకదానికొకటి సీక్వెల్ కావట.
గత కొన్నేళ్లుగా తన దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేస్తున్న వారిని దర్శకులుగా ప్రమోట్ చేస్తూ ప్రముఖ దర్శకుడు సుకుమార్ వరుస సినిమాల్లో భాగస్వాములు అవుతున్న విషయం తెలిసిందే. వేరే నిర్మాణ సంస్థలు సినిమాలు నిర్మిస్తే.. సుకుమార్ అందులో ‘సుకుమార్ రైటింగ్స్’ పేరుతో పార్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఆయన నేరుగా సినిమాలు నిర్మించే ఆలోచన చేస్తున్నారట. అంటే సతీమణి తబిత నిర్మాతగా వ్యవహరిస్తారట. అందులో భాగంగానే ‘కుమారి’ సిరీస్ సిద్ధమవుతోంది అని చెబుతున్నారు.
తబిత సుకుమార్ ఫిల్మ్స్ అనే పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ పెట్టి తొలి సినిమాగా ‘కుమారి 22 ఎఫ్’ అని రూపొందించనున్నారట. అయితే మరి ఈ సినిమాను సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తారా లేక కొత్త దర్శకుడు వస్తారా అనేది చూడాలి. ఎవరొచ్చినా అతను సుకుమార్ శిష్యగణం నుండే వస్తారు అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో చిన్న బడ్జెట్ సినిమాలే ఉంటాయని చెబుతున్నారు కాబట్టి.. యంగ్ హీరోయినే నటిస్తారు అని చెప్పొచ్చు.
ఇదిలా ఉండగా సుకుమార్ రైటింగ్స్ నుంచి త్వరలో సుమారు ఆరు సినిమాలు వస్తాయని చెబుతున్నారు. అందులో ‘పుష్ప’ ఫేమ్ వీరా కొగటం సినిమా ఒకటి. కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో హీరో. ఇక మరో సినిమాతో సుకుమార్ శిష్యురాలు మాధురి దర్శకురాలిగా పరిచయమవుతారు అని సమాచారం. ఈ సినిమాల అనౌన్స్మెంట్ త్వరలోనే ఉంటాయని చెబుతున్నారు.