‘ఇది మణిరత్నం ప్రేమకథ..’ ఈ మాటను ఎప్పుడైనా, ఎక్కడైనా గర్వంగా చెప్పుకోదగ్గ సినిమాలు తీశారాయన. ఆయన చాలా రకాల సినిమాలు తీసినా, అన్ని రకాల జోనర్లు టచ్ చేసినా ‘ప్రేమకథ’ల విషయంలో ఆయన్ను కొట్టేవారే లేరు. ఎప్పటికప్పుడు అప్పటి ట్రెండ్ను పట్టుకుని ఆ స్టైల్ ప్రేమకథలు తీస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఒకట్రెండుసార్లు ఎదురుదెబ్బలు తగిలినా ఆయన ప్రేమకథలు మారలేదు. ఇప్పుడు అదే స్టైల్లో ఓ ప్రేమకథను సిద్ధం చేస్తున్నారట. కొన్ని నెలలుగా ఈ వార్త బయటకు వస్తూ ఉంది. ఆ మధ్య హీరో ఎవరు అనేది కూడా చెప్పేశారు.
అయితే, ఇప్పుడు ఆ కథను అలానే ఉంచి, హీరో– హీరోయిన్లు మార్చేశారట మణిరత్నం. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేసి సినిమాను స్టార్ట్ చేస్తారు అని అంటున్నారు. కొత్త నటుల్లో ఒకరు ఏ పాత్రనైనా అంతే కమాండింగ్తో చేయగల హీరో కాగా, హీరోయిన్ ప్రజెంట్ నేషనల్ క్రష్. వారే విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్. వీరితో మరోసారి తన మార్కు ప్రేమకథ తీయబోతున్నారట. ‘థగ్ లైఫ్’ సినిమా రిలీజ్ కాకముందే శింబుతో ఈ సినిమా తీయాలని ప్లాన్ చేసుకున్నారు మణిరత్నం.
మణిరత్నం రాసుకున్న కథ కాస్త ఏజ్ బార్ ప్రేమకథలా ఉంటుంది అని సమాచారం. నేటితరం జెన్జీ లవ్ మధ్యలో ఓ ఏజ్ బార్ కపుల్ ప్రేమకథను చూపిస్తూ.. ప్రేమించడంలో మార్పుల గురించి చర్చించబోతున్నారు అని సమాచారం. ప్రేమకథలు తీయడంలో మణిరత్నం మార్కు అంటే పరిణతితో, హృద్యం కనిపిస్తాయి. రోజూ మనం చూస్తున్న ప్రపంచంలో ప్రేమను ఆయన వేరే కోణంలో చూపిస్తుంటారు. మరి ఈ ప్రేమ కథలో ఏం చూపించబోతున్నారో చూడాలి. ఇక విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ ఇప్పటికే ‘ఏస్’ అనే సినిమా చేశారు. ఆ సినిమా ఫలితం ఇబ్బందిపెట్టింది. కానీ జోడీగా మాత్రం ఇద్దరి కెమిస్ట్రీ, లుక్ ఆకట్టుకున్నాయి.