‘ఓజీ’ సినిమా కోసం తమన్ ప్రాణం పెట్టి పనిచేశాడు. ఆ సినిమాకు అంత హై రావడం వెనుక తమన్ సంగీతం ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమా రావడం, దాదాపు రన్ పూర్తయిపోయివడం జరిగిపోయాయి. దీంతో ఇప్పుడు ఆయన నెక్స్ట్ టార్గెట్ ‘అఖండ 2: తాండవం’. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాకు తమనే సంగీత దర్శకుడు అనే విషయం తెలిసిందే.
‘ఓజీ’ సినిమాకు ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నప్పుడు తమన్ ఎప్పుడూ ఒకే మాట చెప్పారు. ఈ సినిమా కచ్చితంగా అన్ని భాషల వారికి సమాధానం చెబుతుంది అని. ఆ తర్వాత ఆయన అంతటి కాన్ఫిడెన్స్ ఇస్తూ మాట్లాడిన సినిమా అంటే ‘అఖండ 2’ అనే చెప్పాలి. ‘అఖండ’ సినిమాలో తమన్ అందించిన నేపథ్య సంగీతం గుర్తున్నవారెవరూ ఇప్పుడు ‘అఖండ 2’ గురించి అంచనాలు పెట్టుకోకుండా ఉండరు. ఈ క్రమంలో సర్ప్రైజ్ ఇచ్చారు తమన్.
గంభీరమైన స్వరంతో సంస్కృత శ్లోకాలు వినిపిస్తుండగా… నందమూరి బాలకృష్ణ ఆయుధం చేతపట్టి తెరపైన శత్రు సంహారం చేస్తుంటే ఎలా ఉంటుంది. ఆ శ్లోకాలను నాన్స్టాప్ మిశ్రా సోదరులు పఠిస్తుంటే ఇంకెలా ఉంటుంది. ఇప్పుడు ‘అఖండ 2: తాండవం’ సినిమా కోసం అదే చేస్తున్నారు. సంస్కృత శ్లోకాలు చెప్పడంలో నిష్ణాతులైన పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా సోదర ద్వయాన్ని రంగంలోకి దింపారు తమన్.
మిశ్రా సోదరులు చెప్పే సంస్కృత శ్లోకాలు, వేదమంత్రాలు ‘అఖండ 2: తాండవం’ సినిమా నేపథ్య సంగీతాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయని చిత్రబృందం చెబుతోంది. సంయుక్త కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రధారులు. ఈ సినిమాను డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్రయత్నిస్తోంది. నిజానికి దసరా సందర్భంగా ‘ఓజీ’ సినిమాతో పోటీ పడాల్సి ఉన్నా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కాకపోవడంతో సినిమాను వాయిదా వేశారు.