రూ.99కే తెలుగు సినిమా.. ఈ మాట ఈ మధ్య ఓ సినిమా విషయంలో విన్నాం. అయితే ఏమైందో తెలియదు కానీ రెండ్రోజులకే రూ.99 కాస్తా సుమారుగా రూ.199, రూ.299గా మారిపోయింది. ఎందుకు పెంచేశారు, ఏం జరిగింది అనేది తర్వాత చూద్దాం. ఇప్పుడు మరో సినిమా రూ.99కే టికెట్ అంటూ ముందుకొస్తోంది. అదే ‘మోగ్లీ’. రోషన్ కనకాల హీరోగా సందీప్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మోగ్లీ’. ఈ సినిమానే ఇప్పుడు రూ.99 ధరకు సింగిల్ స్క్రీన్స్ వేస్తారు అని చెబుతున్నారు.
టికెట్ టికెట్ ధరల పెంపు వల్ల థియేటర్లకు కొంతమంది జనం రావట్లేదని టాలీవుడ్లో ఓ వాదన ఉంది. చవకైన వినోద సాధనం సినిమా అని, కానీ రేట్లు ఇలా పెడితే కష్టమని కొంతమంది వాదిస్తున్నారు. ఈ ఆలోచనో లేక, ప్రచారోలోనో కానీ ‘మోగ్లీ’ టీమ్ రూ.99 ప్లానింగ్కి వచ్చింది. ఈ నెల 13న విడుదల కానున్న ఈ సినిమాకు రేట్లు ఇలా తక్కువకు ఫిక్స్ చేశారట. అలా అని సినిమా బడ్జెట్ చిన్నదా అంటే కాదు బాగానే ఖర్చు పెట్టారు అని చెబుతున్నారు. అందుకే తక్కువ ధరతో ఎక్కువమందిని థియేటర్లకు రప్పించి.. కవర్ చేయాలని చూస్తున్నారట.
అయితే, ఇక్కడ ప్రశ్న ఎన్ని రోజులు ఈ ధర ఉంటుంది అని. ఎందుకంటే ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా టీమ్లా కేవలం రెండు రోజులు మాత్రమే ఇలా పెడతారా? లేక ఓ వారం పెడతారా అనేది చూడాలి. ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాకు రూ.99, రూ.105 అంటూ రెండు రేట్లు పెట్టారు. అయితే కొంతమంది ఒత్తిళ్ల వల్ల రెండ్రోజులకు ఆ ధరలు నార్మల్ చేసేశారు అనే విమర్శలు ఆ మధ్య వినిపించాయి. అయితే దీనిపై ఎక్కడా అధికారిక ప్రకటన లేదు. ఇప్పుడు మరి ‘మోగ్లీ’కి ఇలా రెండు రోజుల ముచ్చట పెడతారా? లేక కాస్త పెంచుతారా అనేది చూడాలి.