Bollywood: బాలీవుడ్ స్టార్ హీరోలకు నోటీసులు.. మహేష్కు కూడా నోటీసులు ఇస్తారా?
- August 18, 2026 / 08:13 PM ISTByFilmy Focus Desk
ప్రముఖ బాలీవుడ్ కథానాయకులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గణ్, టైగర్ ష్రాఫ్కు మహారాష్ట్ర ఫుడ్ & డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు షాక్ ఇచ్చారు. పాన్ మసాలాను ఓ ప్రకటన ద్వారా పరోక్షంగా ప్రచారం చేసినందుకుగాను వారిపై చర్యలు చేపట్టింది. ఆయా ఉత్పత్తులకు ప్రచారం చేయడం తక్షణమే నిలిపివేయాలని అంతేకాదు వారి సోషల్ మీడియా ఖాతాల నుండి ఆ కంటెంట్లను తొలగించాలని ఆదేశించింది. వారి ప్రచార ఒప్పందాలు, చెల్లింపులు తదితర వివరాలు తెలియజేయాలని పేర్కొంది.
Bollywood
ఈ మేరకు ఆగస్టు 11న మహారాష్ట్ర ఆహార భద్రతా విభాగం అధిపతి తుకారామ్ ముంఢే నోటీసులు జారీ చేశారు. షారుఖ్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్ చేసిన ఓ యాడ్ వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉందని అధికారులు చెబుతున్నారు. పరోక్షంగా పాన్ మసాలా వైపు ప్రోత్సహించేలా ఉన్నాయి అనేది ఆ నోటీసుల సారాంశం. అయితే దీనిపై అజయ్ దేవగణ్ మాట్లాడుతూ.. నేను కొన్ని బ్రాండ్లను ప్రచారం చేయాలనుకోవడం లేదు. అందుకే వాటి పేరు ప్రస్తావించడం లేదు అని అన్నారు.

గతంలో తాను ఓ యాలకులకు సంబంధించిన ప్రకటనలోనే నటించాని, ఒకవేళ అవి నిజంగానే అంత హానికరమైనవి అయితే వాటి అమ్మకాలనే నిషేధించాలి కదా అని అజయ్ వ్యాఖ్యానించాడు. ఈ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్లుగా ప్రకటన ఉందని గతంలో కొంతమంది అభిమానుల నుండి విమర్శలు రావడంతో దాని నుంచి అక్షయ్ కుమార్ వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ నోటీసుల విషయంలో బాలీవుడ్ హీరోలు ఏం రిప్లై ఇస్తారో చూడాలి.
నిజానికి, ఇలాంటి బ్రాండ్ల ప్రమోషన్లు చాలా వరకు జరుగుతున్నాయి. మద్యానికి సంబంధించిన బ్రాండ్ల ప్రమోషన్లు సోడాలు, నీళ్ల బాటిళ్ల రూపంలో సాగుతున్నాయి. అన్నట్లు తెలుగులో మహేష్ బాబు కూడా ఇలాంటి యాడ్ ఒకటి చేశారు. మన దగ్గర అధికారులు ఇప్పుడు ఏమన్నా స్పందిస్తారేమో చూడాలి. ఒకవేళ స్పందిస్తే మహేష్కు లేనిపోని సమస్యలే అని చెప్పాలి.











