మీరు ఇంట్లో సినిమా చూస్తున్నప్పుడు.. ఎంచక్కా టేబుల్ మీదో, టీపాయ్ మీదో, సోఫాలోనే ఫుడ్ పెట్టుకుని ఎంజయ్ చేస్తుంటారు. ఫుడ్, సినిమా లవర్స్కి ఇప్పుడు అదే ఫీలింగ్ ఇవ్వడానికి పీవీఆర్ ఐనాక్స్ సిద్ధమవుతోంది. ఈ మేరకు బెంగళూరులో ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. అక్కడి ఎం5 ఈసిటీ మాల్లో తొలి డైన్ ఇన్ సినిమాను ప్రారంభించింది. అక్కడ నచ్చిన ఫుడ్ను ఆరగిస్తూనే ఎంచక్కా సినిమాను వీక్షించొచ్చు. ఇప్పుడూ అదే చేస్తున్నాం కదా అనుకుంటున్నారా? ఇప్పుడేముంది స్నాక్స్ మాత్రమే ఉంటాయి. అది కూడా ఇంటర్వెల్ సమయంలోనే.
ఇప్పుడు పీవీఆర్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్.. రెస్టరెంట్లోనే సినిమా చూడటం లాంటిది అని చెప్పొచ్చు. దాని ప్రకారం టికెట్లు మాత్రమే కాకుండా టేబుళ్లకు టికెట్స్ పెట్టి విక్రయించనున్నారు. కుటుంబ సభ్యులంతా కలసి ఓ టేబుల్ బుక్ చేసుకుని సినిమా వినోదాన్ని పొందొచ్చన్నమాట. ఇప్పుడు బెంగళూరులో మొదలైన ఈ వినోదం.. వచ్చే ఏడాదిలో మరో నాలుగు నగరాలకు విస్తరిస్తారట. ఈ ఒక్కో ఆడిటోరియం ఏర్పాటుకు రూ.3 కోట్లు వరకు ఖర్చవుతోందని టాక్.
కేవలం సినిమాలే కాదు.. లైవ్ షోలు, కాన్సర్ట్లు, కార్పొరేట్ ఈవెంట్లు, క్రికెట్ మ్యాచ్ లైవ్లు లాంటివాటికి కూడా డైన్-ఇన్ సినిమా సౌకర్యం ఉండనుందట. టూ-సీటర్ టేబుల్కు రూ.490 (ట్యాక్స్లు అదనం), ఫోర్ సీటర్ టేబుల్కు రూ.990 (ట్యాక్స్లు అదనం)గా ధరను నిర్దేశించినట్లు తెలిపారు. అలాగే ఈ టికెట్లకు డైనమిక్ ప్రైసింగ్ మోడల్ వర్తిస్తుంది. అంటే ఈవెంట్ను బట్టి, రోజులు బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. వీకెండ్లో ఇలాంటి డైన్ ఇన్ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతుందని పీవీఆర్ అంచనా వేస్తోంది.