Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?
- February 6, 2026 / 01:57 PM ISTByFilmy Focus Desk
‘పుష్ప: ది రైజ్’.. ‘పుష్ప: ది రూల్’ సినిమాల విడుదల మధ్యలో షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలా రకాల పుకార్లు వచ్చాయి. సినిమాలో కొత్త హీరోయిన్ వస్తుందని, పక్కనే ఉన్న శిష్యుడు కేశవ విలన్ అవుతాడని, శ్రీవల్లి పాత్ర కనిపించేంత సాఫ్ట్ కాదని.. ఆమె వెనుక పెద్ద కథే ఉంటుందని చాలా రకాల వార్తలు వచ్చాయి. ఆమె విలన్ సైడ్ అని, కాదు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని ఇలా చాలా రకాల వంటకాలు వండేశారు. అందులో రష్మిక మందన.. నెగిటివ్ రోల్ చాలా ఆసక్తికరంగా అనిపించింది. అయితే ‘పుష్ప 2’ సినిమా వచ్చాక చూస్తే.. అలా జరగలేదు.
Rashmika mandanna
అయితే, ఇప్పుడు అదే జరిగేలా కనిపిస్తోంది. అయితే ‘పుష్ప’ సిరీస్లో కాదు. అల్లు అర్జున్ చేస్తున్న కొత్త సినిమాలో. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. AA22 అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో మెయిన్ హీరోయిన్గా దీపికా పడుకొణెను ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఆమె కాకుండా మరో నలుగురు హీరోయిన్లు ఉంటారని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. అందులో రష్మిక మందన పేరు ఇటీవల యాడ్ అయింది. ఇప్పుడున్న సమాచారం ఏంటంటే.. ఆమె ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్లో నటిస్తోంది అని.
ముంబయిలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. తన పాత్ర చిత్రీకరణ కోసం రష్మిక ఇటీవలల సెట్స్లో అడుగు పెట్టిందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే ఆమెది ప్రతినాయిక ఛాయలున్న పాత్ర అని తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో ఆమెతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ఇది. అల్లు అర్జున్ ఇందులో రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడట.
దీపికా పడుకొణె, రష్మిక మందన కాకుండా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా ఈ సినిమా ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు ప్రచారం వినిపిస్తున్నా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇటీవల మృణాల్ అయితే తాను నటిస్తే బాగుండు అని క్లారిటీ లేని సమాధానం ఇచ్చింది.
















