డేరింగ్ డైరక్టర్ సందీప్ రెడ్డి వంగాకు ఓ సినిమా నిర్మాణ సంస్థ ఉందనే విషయం మీకు తెలిసిందే. ఆయన తొలి సినిమాను ఆ నిర్మాణ సంస్థలోనే నిర్మించారు. తాను దర్శకుడు అవ్వడానికే ఆ సంస్థ ఏర్పాటు చేసినట్లు సందీప్ చాలాసార్లు చెప్పారు కూడా. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన మూడు సినిమాల్లో ఆ నిర్మాణ సంస్థ భాగస్వామిగానే ఉంది. ఇప్పుడు తొలిసారి ఆ బ్యానర్ మీద వేరే దర్శకుడు ఓ సినిమా చేయబోతున్నారు.
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో కెరీర్ను ప్రారంభించిన సందీప్ రెడ్డి వంగా.. ఆ వెంటనే బాలీవుడ్ వెళ్లిపోయిన అక్కడ అదే సినిమాను ‘కబీర్ సింగ్’ అని చేశారు. ఆ సినిమా సాధించిన విజయం, సందీప్కి వచ్చిన పేరు ఏకంగా రణ్బీర్ కపూర్ లాంటి స్టార్ హీరోతో కలసి పని చేసే అవకాశాన్ని ఇప్పించింది. అలా ‘యానిమల్’ సినిమాను చేశారు. ఇప్పుడు ప్రభాస్తో ‘స్పిరిట్’ అనే సినిమా తెరకెక్కించే పనుల్లో ఉన్నారు. అయితే ఆయన ఇప్పుడు ఓ చిన్న సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నారట.
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు వేణుని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా అనుకున్నారు. సోషల్ మీడియా స్టార్, ‘మేం ఫేమస్’ సినిమాతో హీరో అయిన సుమంత్ ప్రభాస్ని ఈ సినిమా కోసం హీరోగా ఎంచుకున్నారట. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ కోసం తెలుగు అమ్మాయినే ఎంపిక చేసే పనిలో ఉన్నారట. సందీప్ స్టైల్లో ఈ సినిమా ఉంటుందని.. ఆ వైబ్ నచ్చే ఆయన నిర్మాత అవుతున్నారని ఇండస్ట్రీలో టాక్.
వర్మను సందీప్ ఎప్పుడూ గురు స్థానంలో చూస్తుంటారు. ఇక ‘స్పిరిట్’ సినిమా విషయానికొస్తే.. ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తయ్యింది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను చిత్రీకరణను స్టార్ట్ చేస్తారట. ఎక్కువ శాతం సినిమా ముంబయిలోనే సాగుతుందట.. చిత్రీకరణ కూడా అక్కడే ఎక్కువగా ఉంటుందట. ముంబయిలోని స్పిరిట్ దందాను అందులో చూపిస్తారట.