Shivani Nagaram : తిరుపతిలో 15 నిమిషాల దర్శనం వ్యాఖ్యలపై శివానీ క్లారిటీ
- February 25, 2026 / 05:06 PM ISTByFilmy Focus Desk
తిరుమల అంటే హిందువులకు అపారమైన భక్తి, విశ్వాసాల కేంద్రము. దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు వెంకటేశ్వరస్వామివారి దర్శనార్థం ఇక్కడికి వస్తుంటారు. రెండు సెకన్ల దర్శనభాగ్యం కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడటం అక్కడ సాధారణమే. అలాంటి పవిత్ర క్షేత్రానికి సంబంధించి ఇటీవల హీరోయిన్ శివాని నాగారం చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీశాయి.
Shivani Nagaram
ఓ ఇంటర్వ్యూలో శివాని మాట్లాడుతూ, తాను తిరుమలలో దాదాపు 15 నిమిషాల పాటు స్వామివారిని దర్శించుకున్న అనుభవాన్ని షేర్ చేసింది. చిన్నప్పుడొకసారి తిరుపతి వెళ్లిన తాను, దాదాపు 13 ఏళ్ల తర్వాత మళ్లీ తిరుమలకు వెళ్లానని, ఈసారి శ్రీవారి దర్శనం టికెట్ ద్వారా లైన్ మొదలుకొని గర్భగుడి వరకు స్వామివారిని దగ్గరగా చూసే అవకాశం దక్కిందని చెప్పింది. అయితే ఈ మాటలు కొందరికి తప్పుగా అర్థమై, “హీరోయిన్కు ప్రత్యేక ప్రాధాన్యత ఎందుకు?” అంటూ విమర్శలు మొదలయ్యాయి. గర్భగుడి దగ్గరలో దేవుడి పేరుకంటే సినిమా క్యారెక్టర్ పేరుతో అరవడం తగదని కూడా కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు.

దీనిపై క్లారిటీ ఇవ్వడానికి శివాని ప్రత్యేకంగా వీడియో విడుదల చేసింది. తనకు ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ జరగలేదని, శ్రీవారి బ్రేక్ దర్శనం టికెట్ తీసుకునే ప్రతి భక్తుడికి ఇలానే దర్శనం జరుగుతుందని వివరించింది. 15 నిమిషాలు అంటే పూర్తిగా గర్భగుడిలో నిలబెట్టారన్న అర్థం కాదని, లైన్ మొత్తం ప్రయాణంలో స్వామివారు కనిపించే అనుభూతినే అలా చెప్పానని స్పష్టం చేసింది. దీనిపై స్పష్టత ఇవ్వడం నా బాధ్యతగా భావించి ఈ వీడియో చేస్తున్నాను. ఇది నా టికెట్ అని క్లారిటీ ఇచ్చింది.
ఇక కెరీర్ విషయానికి వస్తే, ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ సినిమాతో పరిచయమైన శివాని, ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా సక్సెస్ తర్వాత ఆమెకు యూత్లో మంచి క్రేజ్ వచ్చింది. తాజాగా సుహాస్తో కలిసి నటించిన ‘హే బలవంత్’ కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. వరుస సినిమాలతో కెరీర్లో ముందుకు సాగుతున్న శివాని, భక్తి-వ్యక్తిగత అనుభవాలపై స్పష్టత ఇవ్వటంతో, ఇక ఈ వివాదం ఇంతటితో సద్దుమణుగుతుందేమో చూడాలి.












