‘శివ’ సినిమాకు ముందు.. తర్వాత అనేలా టాలీవుడ్ గురించి చెబుతుంటారు. అంతలా తెలుగు సినిమాను, తెలుగు సినిమా హీరోల ఆలోచనను, తెలుగు సినిమా రైటర్లు– దర్శకుల ఆలోచనను మార్చేసింది ఆ చిత్రం. ఇప్పుడు 36 ఏళ్ల తర్వాత ఆ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా గురించి చాలామంది తెలియని విషయాలను చెబుతున్నారు. అలా సినిమా స్ఫూర్తి ఏంటో బయటకు వచ్చింది.
నాగార్జున ప్రస్తుతం ఇంత స్టార్డమ్ చూస్తున్నారు అంటే దానికి ఎర్లీడేస్లో వచ్చిన ‘శివ’ సినిమానే కారణం. ఇక ఆర్జీవీ అనే గొప్ప దర్శకుడు టాలీవుడ్కి, ఆ తర్వాత ఇండియన్ సినిమాకు తెలిశారంటే ఆ సినిమానే కారణం. దీని వెనుక బ్రూస్లీ సినిమా ఉందంటే నమ్ముతారా? ఈ విషయాన్ని వర్మనే చెప్పుకొచ్చారు. ఈ సినిమా రీరిలీజ్ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో ఈ కథకు ఎలా అంకురార్పణ జరిగిందనే దాని గురించి చెప్పారు.

దర్శకుడిగా ప్రయత్నాలు మొదలుపెట్టిన కొత్తలో వర్మ దగ్గర ‘రాత్రి’ సినిమా స్క్రిప్ట్ ఒకటే ఉందట. స్టార్ నటులతో ఆ సినిమా చేయాలా లేక కొత్తవాళ్లతోనా అనే డౌట్లోనే ఉన్నారట. అప్పుడే అక్కినేని వెంకట్ ఓ రోజు కలసి నాగార్జునకు సూటయ్యే కథ రాయమని సలహా ఇచ్చారట. దాంతో తన ఫేవరెట్ సినిమ బ్రూస్ లీ ‘రిటర్న్ అఫ్ ది డ్రాగన్’ గుర్తొచ్చిందట. ఆ సినిమాను 15వ సారి చూసిన తర్వాత వర్మకు ఒక ఆలోచన వచ్చిందట. ఆ సినిమాలోని క్యాంటీన్ని కాలేజీగా మారిస్తే ‘శివ’ చేయొచ్చు అనుకున్నారట.
దానికి విజయవాడ కాలేజీలో తాను చదివినప్పటికీ అనుభవాలు జోడించి ‘శివ’ సినిమా కథను రెడీ చేశారట. ఆ రకంగా ‘శివ’ సినిమాకు స్ఫూర్తి బ్రూస్ లీ సినిమా అని అర్థమవుతోంది. అయితే అప్పట్లో ప్రపంచ సినిమా మీద ప్రేక్షకులకు అంత ప్రేమ, పరిచయం లేవు కాబట్టి ఈ విషయం తెలియలేదు. ఇప్పుడు తెలిసినా పెద్ద ఇబ్బందేం లేదు.
